
ఐఎన్ఎస్ సంధాయక్ సర్వే నౌకను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం ఇచ్చారు. శనివారం విశాఖలోని నేవల్ డాక్యార్డులో తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఐఎన్ఎస్ సంధాయక్ నౌకను జాతికి అంకితమిచ్చారు.
హైడ్రోగ్రాఫిక్ సర్వే జరిపేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆదేశాలతో కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) సంస్థ ‘ఐఎన్ఎస్ సంధాయక్’ ను నిర్మించింది. ఇది 3,800 టన్నుల సామర్థ్యంతో 110 మీటర్ల పొడవుంది. హెలిపాడ్, సర్వే సాంకేతిక పరికరాలు, రెండు డీజిల్ యంత్రాలు అమర్చారు.
తాజాగా దీన్ని జాతికి అంకితమిచ్చారు. ఈ కార్యక్రమంలో నౌకాదళ అధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్, తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్ అడ్మిరల్ రాజేశ్ పెందార్క పాల్గొన్నారు. సంధాయక్ నౌకకు కమాండింగ్ అధికారిగా కెప్టెన్ ఆర్.ఎం.థామస్ వ్యవహరించనున్నారు.
ఈ సందర్బంగా రాజ్నాథ్సింగ్ మాట్లాడుతూ భారత నౌకాదళ అమ్ములుపొదిలో ఐఎన్ఎస్ సంధాయక్ జలప్రవేశం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. భారత నౌకాదళం స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోందని చెబుతూ ప్రపంచ సముద్ర జలాల్లో కూడా భారత నౌకాదళం కీలక భద్రత చర్యలు చేపడుతోందని తెలిపారు.
భారత్కు ఎనిమిది వేల నాటికల్ మైళ్ల దూరంలో సముద్రపు దొంగలను కూడా నౌకాదళం అదుపు చేసిందని రక్షణ మంత్రి గుర్తు చేశారు. సముద్ర జలాల్లో శాంతి సామరస్యం పరిరక్షించడమే ఇండియన్ నేవీ లక్ష్యం అని స్పష్టం చేశారు. సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ నగరం అంటూ తూర్పు నౌకాదళం విశాఖ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. విశాఖ గణనీయంగా అభివృద్ధి చెందుతోందని చెబుతూ ఇండియన్ నేవీ విస్తరణలో విశాఖ నగర పాత్ర మరువ లేనిదని తెలిపారు.
More Stories
ఫైళ్లను పట్టించుకోని చంద్రబాబు, ఆయన మంత్రులు
తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగులపై బదిలీ వేటు
గిరిజన చట్టాలు సవరించాలన్న స్పీకర్ వ్యాఖ్యలపై అభ్యంతరం