సీఎం కేజ్రీవాల్‌కు ఐదోసారి ఈడీ నోటీసులు

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు ఇప్పటికే నాలుగు సార్లు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. 
 
అయితే ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో తాజాగా ఐదోసారి ఈడీ సమన్లు పంపింది. ఫిబ్రవరి 2న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.  గ‌తంలో న‌వంబ‌ర్ 2న‌, డిసెంబ‌ర్ 21న, ఆ తర్వాత జనవరి 3న కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 
 
ఆ తర్వాత జనవరి 13వ తేదీన కూడా నాలుగోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. కానీ, నాలుగు సార్లూ ఈడీ నోటీసుల్ని కేజ్రీవాల్‌ ప‌ట్టించుకోలేదు. ఈడీ నోటీసులు అక్రమమంటూ కొట్టిపారేశారు. తనను అరెస్ట్‌ చేసే కుట్రలో భాగంగానే నోటీసులు పంపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అయితే వివిధ కారణాలు చూపి ఆయన ఇంతకు ముందు  తిరస్కరించారు. ఈ క్రమంలోనే తాజాగా ఐదోసారి ఆయనను విచారణకు పిలిచింది. ఈ సారి కేజ్రీవాల్ గైర్హాజరైతే అరెస్టు వారెంట్ నిమిత్తం కోర్టును ఆశ్రయించాలని ఈడీ భావిస్తున్నట్టు సమాచారం. తాజా నోటీసులపై సీఎం ఇంకా స్పందించలేదు.