ఈడీ అధికారులపై కేసు పెట్టిన సీఎం హేమంత్‌ సోరెన్‌

మనీలాండరింగ్‌ ఆరోపణలను ఎదుర్కొంటున్న జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు బుధవారం ఒక వంక విచారిస్తుండగా, మరి వంక ఈడీ అధికారులపై సోరెన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద ఈడీ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ధృవా పోలీసు స్టేషన్‌లో సీఎం సోరెన్‌ ఫిర్యాదు చేసినట్లు రాంచీ పోలీసులు  వెల్లడించారు.
సోమవారం న్యూఢిల్లీలోని సోరెన్‌ నివాసంపై దాడికి సంబంధించి ఈ కేసు నమోదైనట్లు సమాచారం. తనను వేధించడమే ఈడి లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాంచీలోని ఎస్‌సి/ఎస్‌టి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  మరోవైపు మనీలాండరింగ్‌ కేసులో సీఎం సోరెన్‌ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో భారీ భద్రత నడుమ రాంచీలోని సోరెన్‌ నివాసానికి చేరుకున్న ఈడీ బృందాలు సోరెన్‌ను ప్రశ్నిస్తున్నారు.

భూ కుంభకోణం కేసులో గత పది రోజుల్లో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించడం ఇది రెండోసారి. ఈనెల 20న హేమంత్ సోరెన్‌ను 7 గంటలకు పైగా అధికారులు ప్రశ్నించారు. దీనికి కొనసాగింపుగా మరోసారి విచారణ జరిపేందుకు భారీ భద్రత మధ్య రాంచీలోని సోరెన్ అధికార నివాసానికి ఈడీ అధికారులు బుధవారం చేరుకున్నారు.

 దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎంను అరెస్టు చేసే అవకాశాలున్నాయని, ఆమె సతీమణి కల్పానా సోరెన్‌కు హేమంత్ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం కూడా సాగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజ్‌భవన్, సీఎం నివాసం, ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. ఈ క్రమంలోనే జేఎంఎం ఎమ్మెల్యేలు సీఎం నివాసం వద్ద బలప్రదర్శనకు దిగారు. 

కేంద్రం ఆదేశాల మేరకే తమ సీఎంను ఈడీ వేధిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక దిగ్బంధాలకు దిగుతామని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని భావించిన ఈడీ విచారణ సమయంలో అదనపు భద్రత కల్పించాలని పోలీసులను కోరారు. ఈ నేపథ్యంలో సోరెన్‌ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.