డ్రగ్స్‌ కేసులో ఓ టాలీవుడ్‌ హీరో ప్రియురాలు అరెస్టు

స్పెషల్ ఆపరేషన్స్ టీమ్‌కు చెందిన పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో ఓ మహిళ వద్ద భారీగా డ్రగ్స్ పట్టుకోవడం సంచలనం రేపింది. ముందుస్తుగా అందిన పక్కా సమాచారం మేరకు స్పెషల్ ఆపరేషన్స్ టీమ్‌ పోలీసులు నార్సింగి ప్రాంతంలో సోదాల్లో  లావణ్య అనే యువతి వద్ద 4 గ్రాములు ఎండీఎంఏ డ్రగ్స్ దొరికాయి. 
 
వెంటనే ఆ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొని, ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా గోవా నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు తెలిసింది. దీంతో లావణ్యపై ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. లావణ్యకు ఉన్న సంబంధాలు, ఫోన్ అండ్ వాట్సప్ ఛాటింగ్‌ను పరిశీలిస్తూ నార్సింగ్ పోలీసుల మరికొంత మంది నివాసాలపై దాడులు నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం
 
కాగా, లావణ్య ఓ టాలీవుడ్‌ హీరోకు ప్రియురాలు అనే విషయం కూడా ఈ దర్యాప్తులో బయటపడింది.  కోకాపేటలోని ఓ అపార్ట్‌మెంటులో ఉంటున్న లావణ్య మ్యూజిషియన్‌గా పనిచేస్తున్నది. మూడు నెలల క్రితం వరలక్ష్మీ టిఫిన్స్‌ అధినేతపై నమోదైన డ్రగ్స్‌ కేసులో లావణ్య పేరు కూడా బయటకొచ్చింది. కానీ అప్పుడు దొరక్కుండా లావణ్య తప్పించుకుంది. 

దీంతో లావణ్యపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే డ్రగ్స్‌ తీసుకెళ్తుందనే పక్కా సమాచారంతో ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన లావణ్య ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తనిఖీ చేయగా హ్యాండ్‌ బ్యాగులో నాలుగు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ లభించాయి.ఈ క్రమంలో లావణ్య ను అదుపులోకి తీసుకుని విచారించగా ఉనిత్‌ రెడ్డి అనే వ్యక్తి డ్రగ్స్‌ ఇచ్చినట్లుగా తెలిపింది. ఉనిత్‌ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి ఈ డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లుగా తెలిసింది. 

కాగా, లావణ్య మ్యూజిషియన్‌గా పనిచేస్తుండటంతో సినీ ఇండస్ట్రీలోనూ ఈమెకు పరిచయాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. లావణ్య కేవలం డ్రగ్స్‌ తీసుకుంటుందా? లేదా సినీ ఇండస్ట్రీలో ఎవరికైనా విక్రయిస్తుందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె సెల్‌ఫోన్‌ డేటాను సేకరిస్తున్నారు.