కరీంనగర్ నుండే బీజేపీ ఎన్నికల శంఖారావం

* 28న మూడు క్లస్టర్ సమావేశాలలో అమిత్ షా

పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని కరీంనగర్ నుండే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూరించబోతున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. అందులో భాగంగా ఈనెల 28న కరీంనగర్ లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో 10 నుండి 20 వేల మంది బీజేపీ కార్యకర్తలతో పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. 

అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనానికి సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ కేంద్ర హోంమంత్రి రాకను పురస్కరించుకుని పార్టీ నాయకులతోపాటు జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగంతోనూ చర్చించారు.

అమిత్ షా 28న తెలంగాణలో మూడు క్లస్టర్ మీటింగుల్లో, ఎలక్షన్ మేనేజ్ మెంట్ మీటింగ్ లో పాల్గొంటారు. హైదరాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్ లో అమిత్ షా ఆదివారం పర్యటించనున్నారు. లోక్ సభ ఎన్నికలపై పార్టీ నేతలకు షా దిశానిర్దేశం చేయనున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలిచేందుకు బిజెపి వ్యూహాలు రచిస్తోంది.

వీటితోపాటు చారిత్రక కట్టడాలను సందర్శిస్తారు. అందులో భాగంగా ఈనెల 28న ఉదయం పాలమూరులో, మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్ చేరుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికలపై కార్యకర్తలకు ఈ సమావేశాల్లో మార్గదర్శనం చేస్తారు. ఇక్కడి నుండే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. కాబట్టి ఈ సమ్మేళనానికి ప్రతి ఒక్క కార్యకర్త హాజరై విజయవంతం చేయాలని సంజయ్ కోరారు.

కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళుతున్నామని చెబుతూ కేంద్ర ప్రభుత్వం ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చింది? ఏయే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందనే అంశంపై పూర్తి వివరాలను గ్రామాల వారీగా వివరిస్తారు. ఫిబ్రవరి 5 నుండి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో యాత్ర ప్రారంభిస్తున్నారు. 

గ్రామాల్లో పాదయాత్ర చేస్తానని చెబుతూ సమయాభావాన్ని ద్రుష్టిలో పెట్టుకుని ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్లేటప్పుడు మాత్రం వాహనంలో వెళతానని, దాదాపు 20 రోజులపాటు యాత్ర కొనసాగిస్తానని సంజయ్ వివరించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీల్లో పాదయాత్ర చేసి ప్రజలను కలుస్తూ కేంద్రం చేసిన కార్యక్రమాలను ఇంటింటికీ వివరిస్తానని చెప్పారు.