నియంతృత్వానికి ప్రజాస్వామ్యంలో చోటు లేదు

ఏకపక్ష నిర్ణయాలు, నియంతృత్వానికి ప్రజాస్వామ్యంలో చోటులేదంటూ  తెలంగాణ గవర్నర్‌ డా. తమిళ సై సుందరాజన్ గత పదేళ్లుగా రాజ్యమేలిన బిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొంటూ గవర్నర్‌ తమిళ సై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఇతర మంత్రులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
 
తమిళి సై జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో గత పదేళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారని, తెలంగాణ సమాజం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో నియంతృత్వ ధోరణికి ప్రజలు తమ తీర్పు ద్వారా చరమగీతం పాడారని ఆమె చెప్పారు. 
 
అహంకారం, నియంతృత్వం చెల్లదని ప్రజలు స్పష్టమైన తీర్పు ప్రకటించారని చెబుతూ  నియంతృత్వ ధోరణిని ప్రజలు సహించలేదని ఆమె స్పష్టం చేశారు.
పదేళ్ల పాలనలో రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలు విధ్వంసానికి గురయ్యాయని చెబుతూ ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే మళ్లీ పునర్‌ నిర్మించుకుంటున్నాయని గవర్నర్ చెప్పారు. 
 
శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరణ చేసుకుంటున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నట్లు చెప్పారు. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్య, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయని గవర్నర్ హామీ ఇచ్చారు. 
 
 ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి శోభనివ్వవని కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఈ స్పృహతో పని మొదలు పెట్టిందని గవర్నర్‌ చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో పని చేస్తోందని ఆమె భరోసా ఇచ్చారు. 
 
గత ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో తెలంగాణలో ఆర్థికస్థితి దిగజారిందని పేర్కొంటూ టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నామని గవర్నర్‌ చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచిన యువతకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని చెబుతూ వంద రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలు చేస్తామని,  ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె భరోసా ఇచ్చారు.
ఇలా ఉండగా, ప్రజాస్వామిక పాలన ద్వారానే రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. స్వేచ్ఛా స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వంతో పాటు అందరికీ న్యాయం అందాలనే మన భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని స్పష్టం చేశారు.