జమిలి ఎన్నికలకు15 ఏండ్లకోసారి రూ. 10 వేల కోట్లు వ్యయం

* రాజ్యాంగానికి ఐదు సవరణలు అవసరం
 
జమిలి ఎన్నికలు (లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు) నిర్వహిస్తే కొత్త ఇవిఎంలు కోసం ప్రతి 15 ఏళ్లకు రూ. 10 వేల కోట్లు అవసరమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వానికి పంపిన ఒక సమాచారంలో ఈ విషయాన్ని ఎన్నికల సంఘం పేర్కొంది.  ఇవిఎంల జీవిత కాలం 15 ఏళ్లు అని, జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఒక సెట్‌ ఇవింఎలను మూడుసార్లు ఎన్నికల్లో వినియోగించుకోవచ్చనని తెలిపింది.
ఎన్నికల సంఘం అంచనా ప్రకారం ఈ ఏడాదిలో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం 11.80 లక్షల పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.  ఒకవేళ జమిలి ఎన్నికలు జరిగితే ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లోనూ రెండు సెట్ల ఇవిఎంలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒకటి లోక్‌సభ స్థానానికి, మరొకటి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ప్రతి ఇవిఎంకి కంట్రోల్‌ యూనిట్‌ (సియు), బ్యాలెట్‌ యూనిట్‌ (బియు), ఓటర్‌-వెరిఫైబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వివిపిఎటి) మెషిన్‌ జత చేయాల్సి ఉంటుంది. 
గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లోనూ సియు, బియు, వివిపిఎటిలు అదనంగా అవసరమని ఇసి పేర్కొంది. ఈ వివరాలను జమిలి ఎన్నికలపై కేంద్ర న్యాయ శాఖ పంపిన ప్రశ్నావళికి ఇచ్చిన సమాధానంలో ఎన్నికల సంఘం తెలిపింది. 
 
జమిలి ఎన్నికలు నిర్వహిస్తే కనీసం 45,75,100 బియులు, 33,63,300 సియులు, 36,62,600 వివిపిఎటిఎస్‌లు అవసరమని ఎన్నికల సంఘం పేర్కొంది. 2023 ప్రారంభంలో బియు ధర రూ.7,900, సియు ధర రూ. 9,800, వివిపిఎటి ధర రూ. 16,000గా ఉంది.  ఇవిఎంల ధరతో పాటు పోలింగ్‌, భద్రతా సిబ్బంది కోసం, ఇవిఎంలు దాచి ఉంచడానికి, వాహనాలకు, రవాణాకు అదనంగా మరింత వ్యయం అవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది.
అన్నీ అనుకూలంగా ఉన్నా 2029లో మాత్రమే జమిలి ఎన్నికలు నిర్వహించగలమని ఎన్నికల కమిషన్‌ తెలిపింది.  జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగంలోని ఐదు ఆర్టికల్స్‌కు సవరణలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. పార్టీ ఫిరాయింపులపై అనర్హతకు సంబంధించిన రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో కూడా కొన్ని అవసరమైన మార్పులు చేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్‌ తెలిపింది.

పార్లమెంటు సభల కాలవ్యవధికి సంబంధించిన ఆర్టికల్‌ 83, లోక్‌సభను రాష్ట్రపతి రద్దు చేయడానికి సంబంధించిన ఆర్టికల్‌ 85, రాష్ట్ర శాసనసభల కాలవ్యవధికి సంబంధించిన ఆర్టికల్‌ 172, రాష్ట్రాల శాసనసభల రద్దుకు సంబంధించిన ఆర్టికల్‌ 174, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించిన ఆర్టికల్‌ 356కు సవరణ చేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్‌ తెలిపింది.