రామ మందిరం పేరుతో అమెజాన్‌ లో నకిలీ ప్రసాదం

అయోధ్య రామ మందిరం పేరిట నకిలీ ప్రసాదం అమ్మకాలు చేపట్టిందన్న ఆరోపణలతో ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌కు కేంద్రం నోటీసులు ఇచ్చింది. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో అమెజాన్‌ సంస్థ ఆన్‌లైన్‌లో రామ మందిరం పేరిట నకిలీ ప్రసాదాన్ని విక్రయిస్తోందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్ ఇండియా ట్రేడర్స్‌ ఫిర్యాదు చేసింది.
 
సాధారణ మిఠాయిలనే ‘శ్రీ రాం మందిర్ అయోధ్య ప్రసాదం’ పేరుతో ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారని ఆరోపించింది. తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఏఐటీ ఫిర్యాదు మేరకు వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ అమెజాన్‌ సంస్థకు నోటీసులు అందజేసింది.

వారం రోజుల్లో నోటీసులకు స్పందించాలని, లేదంటే వినియోగదారుల రక్షణ చట్టం 2019 కింద తీసుకోబోయే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఈ నోటీసులపై అమెజాన్ స్పందించింది. సీసీపీఏ నుంచి నోటీసులు అందాయని, ఆయా సెల్లర్లపై తమ విధానాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని అమెజాన్ అధికార ప్రతినిధి తెలిపారు. 

ఈ మేరకు సెల్లర్ల సేల్స్ ఆప్షన్‌ను తొలగించినట్టు చెప్పారు. కాగా, అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో కొందరు వ్యాపారులు దానిని సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు. 

ఇందులో భాగంగానే ‘శ్రీరామ్‌ మందిర్‌ అయోధ్య ప్రసాద్‌’, ‘రఘుపతి ఘీ లడ్డూ’, ‘అయోధ్య రామ్‌ మందిర్‌ ప్రసాద్‌’, ‘ఖోయా ఖోబీ లడ్డూ’, ‘రామ్‌ మందిర్ అయోధ్య ప్రసాదం- దేశీ ఆవు పేడా (స్వీట్)’ పేరుతో అమెజాన్‌లో విక్రయిస్తున్నారు. సీసీపీఏ నుంచి నోటీసులు రావడంతో ఇప్పుడు వీటి సేల్స్‌ను అమెజాన్ నిలిపివేసింది.