హైదరాబాద్ లో అతివలకోసం అధునాతన నైపుణ్య శిక్షణ కేంద్రం

మహిళలను ‘నారీశక్తి’గా గుర్తించి, దేశాభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేసేందుకు వారికి సంపూర్ణమైన చేయూతను అందిస్తూ వారి సాధికారతకోసం కృషిచేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం నగర యువతులకు నైపుణ్యాభివృద్ధి అందించే దిశగా మరో అడుగు ముందుకేసింది.

ఇందులో భాగంగా, హైదరాబాద్ నగరం నడిబొడ్డున నల్లకుంట శివం రోడ్డులో ఉన్న అడ్వాన్స్ ట్రయినింగ్ ఇనిస్టిట్యూట్ లో మహిళలకు నైపుణ్య శిక్షణనిచ్చి,  మహిళాభివృద్ధి నుంచి మహిళల నేతృత్వంలో అభివృద్ధి జరిగేందుకు బాటలు వేసేలా అత్యాధునిక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రానికి సంబంధించిన భవన నిర్మాణం కూడా పూర్తయింది.

కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌ (ఎన్ఎస్టిఐ)ను కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆదివారం ప్రారంభిస్తున్నారు.  ఈ కేంద్రం ద్వారా ఐటీఐ పాస్ అయిన వారికి ఇన్‌స్ట్రక్టర్ ట్రైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ, కాస్మెటాలజీ, ఆర్కిటెక్చురల్ డ్రాట్స్‌మన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి-స్మార్ట్ అగ్రికల్చర్) వంటి కోర్సులతో పాటుగా,  మార్కెట్లో డిమాండ్ ఉన్న  ప్రొఫెషనల్ బ్యూటీ థెరపీ, కట్టింగ్& టైలరింగ్, స్టిచింగ్, అటోక్యాడ్ వంటి కోర్సుల్లో శిక్షణ అందించనున్నారు.

మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మహిళలను సశక్తీకరణ చేసే లక్ష్యంతో  ద్వారా ప్రపంచ మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా మన మహిళలను సిద్ధం చేసే ఉద్దేశంతో ఈ కోర్సులను డిజైన్ చేశారు.

ఆధునిక గ్యాలరీలతో సాలార్‌జంగ్ మ్యూజియం

కాగా, చారిత్రక సాలార్‌జంగ్ మ్యూజియాన్ని మరింత ఆధునీకరించే లక్ష్యంతో ఈ మ్యూజియంలో కేంద్రప్రభుత్వ నిధులతో కొత్తగా నిర్మించిన రెండు అధునాతన బ్లాక్‌లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన రెండు బ్లాకుల్లో మొదటిది వెస్టర్న్ బ్లాక్ కాగా, రెండోది సెంట్రల్ బ్లాక్.  రెండో అంతస్తులో ఏర్పాటుచేసిన వెస్టర్న్ బ్లాక్‌లో ల్యాంప్స్, శాండిలియర్స్, యురోపియన్ బ్రాంజ్, యురోపియన్ మార్బల్ సంబంధిత పెయింటింగ్స్, కళాకృతుల వస్తువుల ప్రదర్శన ఉంటుంది. సెంట్రల్ బ్లాక్‌లో బిద్రివేర్, ఇండియన్ స్టోన్ స్కల్ప్చర్ (భారతీయ రాతి కళాకృతులు) ప్రదర్శన ఉంటుంది.