పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తింపు కోల్పోడం ఖాయం 

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో 17 పార్లమెంట్ స్థానాల్లో అందరికంటే ఎక్కువ స్థానాలు బీజేపీ గెలుస్తుందని  పార్టీ మాజీ ఎమ్యెల్యే ఎం రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తింపు కోల్పోడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారులను, కార్యకర్తలను ఏనాడైనా గౌరవిస్తే ఇవాళ ఈ పరిస్థితి ఆ పార్టీకి ఉండేది కాదు కదా అంటూ హితవు పలికారు. 

పార్లమెంటు ఎన్నికల్లో వందలకోట్లు సమర్పించుకున్న వారికే టిక్కెట్లు అమ్ముకుంటారని ఆయన దుయ్యబట్టారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు, సంతోష్ కుమార్.. ఎంపీలుగా పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి వేసే ప్రతి ఓటు మూసీ నదిలో వేసినట్టేనని ఆయన హెచ్చరించారు.

కేఆర్‌ఎంబీకి తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులను అప్పజెప్పడం వల్ల నష్టం జరుగుతుందని, భవిష్యత్తులో కృష్ణా జలాల్లో తెలంగాణకు నీటివాటా లభ్యం కాదని బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీశ్ రావు చేసిన విమర్శల పట్ల విస్మయం వ్యక్తం చేశారు. కృష్టా నీటిలో 299 టీఎంసీలకు ఒప్పందం చేసుకుంది కేసీఆరేనని గుర్తు చేస్తూ ఒకవేళ కృష్టాజలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగితే  అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకుపోలేదని ఆయన ప్రశ్నించారు.

2014-2019 మధ్య కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో జరిగిన కృష్ణానదీ జలాల పంపకాలపై జరిగిన సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ హాజరై 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు చాలని సంతకం పెట్టింది వాస్తవమా? కాదా..? హరీశ్ రావు సమాధానం చెప్పాలని ఆయన సవాల్ చేశారు.  నాడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రావుకు ఈ విషయాలు తెలియవా? అని ఎద్దేవా చేశారు.

ఎన్నికలు వస్తేనే బీజేపీని బద్నాం చేసేందుకు ప్రచారం మొదలుపెడుతరని మండిపడ్డారు. దుబ్బాకలో ఉప ఎన్నికలు రాగానే మోటార్లకు మీటర్లు అంటూ బీఆర్ఎస్ నాయకులు పంచాయతీ మొదలుపెట్టారని,  తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందంటూ అసత్యాలు ప్రచారం చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ లేదు అనేవారికి దుబ్బాక ఉపఎన్నికల్లో సత్తా చూపించామని చెబుతూ  రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్కసీటు కూడా గెలవదని రఘునందన్ రావు స్పష్టం చేశారు.


చేతనైతే కేసీఆర్ కుటుంబంలోని ఐదుగురు నాయకులు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయండని సవాల్ చేశారు. వారు ఒక్కసీటు కూడా గెలవలేరని తెలిపారు. తెలంగాణ ప్రజలు కర్రుగాల్చి వాతపెట్టక తప్పదని హెచ్చరించారు.
మెదక్ పార్లమెంటులో 1998లోనే బీజేపీ గెలిచిందని, ఇది హరీశ్ రావు గుర్తెరగాలని హితవు చెప్పారు.

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఏం లాభం జరిగిందో అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. ప్రధాని మోదీ గారు తెలంగాణకు వస్తే పదిసార్లు మొహం చాటేసింది గత ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ధ్వజమెత్తారు.  ఆగస్టు 2016లో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన్నపుడు  నాడు కేసీఆర్ … నిధులు వద్దు.. మీ హృదయంలో చోటిస్తే చాలంటూ ప్రధానిపై పొగడ్తలు కురిపించారని గుర్తు చేశారు. 

గజ్వేల్ కు, సిద్దిపేటకు రైలు సదుపాయం కల్పించింది నరేంద్ర మోదీ ప్రభుత్వం అని చెబుతూ రామగుండంలో యూరియా ఫ్యాక్టరీ పునరుద్ధరణ కూడా జరిపించారని తెలిపారు.  దేశంలో కేవలం 15 రోజుల్లో యాదాద్రి పవర్ ప్లాంటుకు అనుమతులు ఇచ్చిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని నాడు కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారని బీజేపీ నేత గుర్తు చేశారు. మమతా బెనర్జీ, పిన‌ర‌యి విజ‌య‌న్ లాంటి వారు ఆయా రాష్ట్రాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ని కలుస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎందుకు కలవలేదు..? అని ప్రశ్నించారు.