రష్మిక మందన డీప్‌ఫేక్ వీడియో కేసులో ఏపీ వ్యక్తి అరెస్టు

సినీ నటి రష్మిక మందన డీప్‌ ఫేక్‌ వీడియో కేసులో నిందితుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తేనని తేలింది. రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులో ఏపీకి చెందిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు శనివారం తెలిపారు. అతడే ఈ వీడియోను సృష్టించినట్లు అనుమానాలు ఉన్నాయని వెల్లడించారు.  ప్రస్తుతం నిందితుడిని ఇంకా విచారిస్తున్నట్లు చెప్పారు.
 నిందితుడ్ని ఈమని నవీన్ అని గుర్తించారు. 24 ఏళ్ల నవీన్ గుంటూరు జిల్లాకు చెందినవాడు. అసభ్యకర రీతిలో రష్మిక డీప్ ఫేక్ వీడియో రూపొందించి, ఆ వీడియో సోషల్ మీడియా వేదికల్లో అప్ లోడ్ చేసింది నవీనే అని వెల్లడైంది. ఈ  కేసు విచారణలో భాగంగా డీప్ ఫేక్ వీడియోలతో సంబంధం ఉందని భావించిన 500కి పైగా సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించామని ఢిల్లీ డీసీపీ హేమంత్ తివారీ వెల్లడించారు.

దేశవ్యాప్తంగా అనేకమంది సోషల్ మీడియా ఖాతాల సొంతదారులను విచారించామని, రష్మిక డీప్ ఫేక్ వీడియోకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించామని తెలిపారు. అనుమానితులను లోతుగా విచారించిన తర్వాత రష్మిక డీప్ ఫేక్ వీడియో ఓ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అప్ లోడ్ అయినట్టు గుర్తించామని డీసీపీ వివరించారు. ఒరిజినల్ వీడియో వాస్తవానికి ఓ జరా పటేల్  అనే బ్రిటీష్ మోడల్ దని, ఆ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో 2023 అక్టోబరు 9న పోస్టు చేశారని, ఆ వీడియో ఆధారంగా రష్మిక డీప్ ఫేక్ వీడియోను రూపొందించిన అక్టోబరు 13న పోస్టు చేశారని వెల్లడించారు.

సేకరించిన ఆధారాల ప్రకారం ఏపీలోని గుంటూరు చేరుకుని, నిందితుడు నవీన్ ఆచూకీ కనుగొన్నామని తెలిపారు. అతడు తన నేరాన్ని ఒప్పుకున్నాడని డీసీపీ పేర్కొన్నారు. విచారణలో నవీన్, తాను రష్మికకు పెద్ద అభిమానినని చెప్పాడని, ఆమె పేరిట ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేసి నిర్వహిస్తున్నట్టు తెలిపాడని వివరించారు. మరో ఇద్దరు సెలబ్రిటీల పేరిట కూడా నవీన్ ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేసి నిర్వహిస్తున్నాడని డీసీపీ వెల్లడించారు.

కాగా, రష్మిక డీప్ ఫేక్ వీడియో పోస్టు చేసిన అనంతరం నవీన్ నిర్వహించే ఫ్యాన్ పేజీల్లో ఒకదానికి ఫాలోవర్ల సంఖ్య 90 వేల నుంచి ఒక్కసారిగా 1.08 లక్షలకు పెరిగిపోయిందని తెలిపారు. అయితే, ఈ డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం, సెలెబ్రిటీలు సైతం దాన్ని ఖండిస్తుండడంతో భయపడిపోయిన నవీన్… ఇన్ స్టాగ్రామ్ నుంచి ఆ వీడియోను డిలీట్ చేశాడని డీసీపీ హేమంత్ తివారీ వెల్లడించారు.

పుష్ప, యానిమల్ లాంటి సినిమాలతో రష్మిక మందన జాతీయ స్థాయిలోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.  గతేడాది నవంబరులో ఆమెకు సంబంధించిన ఫేక్ వీడియో వైరల్ కావడం సంచలనం సృష్టించింది.  ఆ వీడియోపై రష్మిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీని చూస్తే భయమేస్తోందని పేర్కొన్నారు. రష్మిక స్పందన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది.
రష్మిక డీప్ ఫేక్ వీడియో అంశంపై ఢిల్లీ పోలీసులు నవంబర్ 10న కేసు నమోదు చేశారు.  సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియోపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రష్మికకు మద్దతుగా నిలిచారు. ఢిల్లీ మహిళా కమిషన్‌ నుంచి ఆ అంశంపై ఢిల్లీ పోలీసులకు నోటీసులు అందడంతో వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.