భారత్‌లోకి వందలాది మయన్మార్ సైనికుల వలస

* మయన్మార్ సరిహద్దులో త్వరలో కంచె

మయన్మార్‌ లో నెలకొన్న అంతర్యుద్ధం పొరుగున ఉన్న భారత్ లోని ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ఆ దేశానికి చెందిన వందలాది సైనికులు పారిపోయి భారతదేశంలోకి వస్తున్నారు. మయన్మార్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. మయన్మార్‌లో 2021వ సంవత్సరంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి సైనిక పాలకులు అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి విదితమే.

ప్రజాస్వామ్య అనుకూల వర్గాలు పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలతో దేశంలో అంతర్యుద్ధం నెలకొంది. దీంతో మిజోరం ప్రభుత్వం ఆందోళన చెందుతూ కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ప్రస్తుత జరుగుతున్న ఈ పరిస్థితులపై ముఖ్యమంత్రి లాల్‌దుహౌమా షిల్లాంగ్‌లో జరిగిన ఈశాన్య మండలి ప్లీనరీ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో చర్చించారు.

 ” ఆశ్రయం పొందేందుకు మయన్మార్‌ నుంచి ప్రజలు మనదేశంలోకి ప్రవేశిస్తున్నారు. మానవతా దృక్పథం కింద మేం వారికి సాయం చేస్తున్నాం. ఆ దేశం నుంచి సైనికులు వస్తూనే ఉన్నారు. ఇప్పటికే 400 మందిని వెనక్కి పంపించేశాం ” అని సమావేశం అనంతరం సిఎం మీడియాకు వెల్లడించారు.  దానితో భారత్, మయన్మార్ సరిహద్దులో కంచెను కేంద్రం త్వరలో ఏర్పాటు చేస్తుందని అమిత్ షా ప్రకటించారు.

దేశంలోకి స్వేచ్ఛాయుత రాకపోకల నిరోధానికి బంగ్లాదేశ్‌తో సరిహద్దులో కంచె ఏర్పాటు చేసిన వైనాన్ని ఈ సందర్భంగా ఉదహరించారు. భారత్, మయన్మార్ సరిహద్దు సమీపంలో నివసించే జనం 16 కిలోమీటర్ల దూరం దాటి పరస్పర భూభాగంలోకి ప్రవేశించేందుకు వీలు కల్పిస్తున్న ‘స్వేచ్ఛా రవాణా వ్యవస్థ (ఎఫ్‌ఎంఆర్)’ ఈ ప్రకటనతో త్వరలో ముగియగలదు.

 ‘బంగ్లాదేశ్‌తో సరిహద్దులో వలె మయన్మార్‌తో గల స్వేచ్ఛ సరిహద్దులో కంచె ఏర్పాటు చేసేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం నిశ్చయించిందని అస్సాంలోని మా మిత్రులకు చెప్పదలిచాను’ అని అమిత్ షా తెలిపారు. ‘మయన్మార్‌తో గల భారత్ స్వేచ్ఛా రాకపోకల వ్యవస్థ (ఎఫ్‌ఎంజి) ఒప్పందంపై కూడా ప్రభుత్వం పునఃపరిశీలిస్తోంది. భారత్‌లోకి స్వేఛ్చా రాకపోకలు త్వరలో ముగియగలవు’ అని మంత్రి చెప్పారు.

మయన్మార్‌లో తీవ్ర ఘర్షణల నేపథ్యంలో సుమారు 600 మంది సైనికులు మిజోరంలోకి చొరబడ్డారు. అస్సాం రైఫిల్స్ క్యాంపులో ఆశ్రయం పొందారు. గతంలో సుమారు 450 మంది మయన్మార్‌ సైనికులను వాయు మార్గంలో తిరిగి పంపినట్లు ముఖ్యమంత్రి  లాల్దుహోమా చెప్పారు. అయినప్పటికీ వందలాది మంది మయన్మార్‌ సైనికులు ఆశ్రయం కోసం మిజోరంలోకి చొరబడుతున్నారని తెలిపారు.

మరోవైపు మయన్మార్‌ సైనికుల చొరబాటు ఉద్రిక్తతలకు దారి తీయడంతోపాటు ఈ ప్రాంతం స్థిరత్వంపై ప్రభావం చూపుతుందని లాల్దుహోమా ఆందోళన వ్యక్తం చేశారు.  ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. మయన్మార్‌ సైనికులను త్వరగా తిరిగి పంపేలా చూడాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరారు. మయన్మార్‌తో భారత్‌కు 1643 కిలో మీటర్ల నిడివి గల సరిహద్దు ఉన్నది.

అది మిజోరామ్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ మీదుగా సాగుతుంది. ఆ రాష్ట్రాలన్నీ ప్రస్తుతం ఎఫ్‌ఎంఆర్‌ను వినియోగిస్తున్నాయి. భారత్ ‘ఏక్ట్ ఈస్ట్’ విధానంలో భాగంగా 2018లో దానిని అమలు పరుస్తున్నారు. రెబల్‌ గ్రూప్‌ అరాకన్‌ ఆర్మీ సైనికుల శిబిరాలను స్వాధీనం చేసుకోవడంతో వారంతా మిజోరంలోని లాంగ్‌ట్లాయ్ జిల్లాలో ఆశ్రయం పొందుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

అస్సాం రైఫిల్స్‌ క్యాంపుల్లో వారు ఉంటున్నట్లు తెలుస్తోంది. మయన్మార్‌లో జరుగుతున్న దాడుల్లో ‘త్రీబ్రదర్‌హుడ్‌ అలయన్స్‌ (టీబీఏ)’ కీలక పాత్ర పోషిస్తోంది.  ఇందులో మయన్మార్‌ జాతీయ ప్రజాస్వామ్య కూటమి సైన్యం (ఎంఎన్‌డీఏఏ), టాంగ్‌ జాతీయ విమోచన సైన్యం(టీఎన్‌ఎల్‌ఏ), అరాకన్‌ ఆర్మీ(ఏఏ) భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. దేశంలో అత్యంత శక్తివంతమైన సాయుధ తిరుగుబాటు సంస్థలుగా వీటికి పేరుంది.