పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కన్నులపండువగా ‘తిరంగా ర్యాలీ’

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కన్నులపండువగా ‘తిరంగా ర్యాలీ’
ప్రపంచంలో అనేక దేశాలు యుద్ధ సంక్షోభంలో కూరుకుపోయినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత, గొప్ప నిర్ణయాలు, సుపరిపాలన వల్ల భారత దేశ ఆర్థిక ప్రగతి ఎక్కడా ఆగకుండా దిగ్విజయంగా ముందుకు సాగుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు  ఎన్. రాంచందర్ రావు తెలిపారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ ‘తిరంగా ర్యాలీ’కి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా జాతీయ జెండాలతో బిజెపి శ్రేణులు, విద్యార్థులు, యువత, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేశారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ మల్క కొమురయ్య , సీనియర్ నాయకుడు గోమాస శ్రీనివాస్, బిజెపి జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, రాష్ట్ర నాయకులు మనోహర్ రెడ్డి, సురేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  రాంచందర్ రావు ప్రసంగిస్తూ, రాబోయే రోజుల్లో భారతదేశాన్ని ప్రపంచంలోనే శక్తివంతమైన ‘వికసిత్ భారత్’గా తీర్చిదిద్దడమే మనందరి ప్రధాన సంకల్పం కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఇప్పటికే ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని, దేశ భవిష్యత్తును నిర్మించే విద్యార్థులు, యువత ఈ వికాస ప్రయాణంలో అత్యంత కీలక పాత్ర పోషించాలని సూచించారు.

దేశంలో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ముద్ర లోన్ల ద్వారా కోట్లాది మంది యువత స్వయం ఉపాధి పొందుతూ ఉద్యోగ సృష్టికర్తలుగా మారుతున్నారని కొనియాడారు.

గత ప్రభుత్వాల పాలనతో పోలిస్తే మోదీ ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో సాధించిన ప్రగతిని ఆయన వివరిస్తూ, దేశంలో విద్యా విప్లవం ఆవిష్కృతమైందని పేర్కొన్నారు. గతంలో దేశంలో కేవలం 16 (ఒకప్పుడు 6) ఉంటే, నేడు ఆ సంఖ్య 23కి పెరిగిందని, ఎన్ఐటీలు గతంలో 6 మాత్రమే ఉండగా, ప్రస్తుతం 25కి విస్తరించాయని. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలోనూ ఎయిమ్స్ ఆసుపత్రులు వచ్చాయని వివరించారు. కేంద్ర విశ్వవిద్యాలయాలతో సహా మొత్తం విద్యా వ్యవస్థలోనే గొప్ప సంస్కరణలు వచ్చాయని రాంచందర్ రావు   వెల్లడించారు.

స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న ఈ శుభతరుణంలో, మన ఆలోచనా విధానం ఎల్లప్పుడూ దేశ సమగ్రతను కాపాడేదిగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ “నేషన్ ఫస్ట్” (దేశమే ప్రథమం) అనే సంకల్పంతో కలసికట్టుగా పనిచేసి, నవ భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు  కోరారు.