కొమురవెల్లిలో కొత్త రైల్వే హాల్ట్ స్టేషన్

కొమురవెల్లి మల్లన్న భక్తుల సుదీర్ఘ కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. మనోహరాబాద్- కొత్తపల్లి మధ్యలో కేంద్రప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న రైల్వే మార్గంలో ఉన్న కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ నిర్మించి భక్తులకోసం రైలు ఆగేందుకు మార్గం సుగమమైంది.

కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ అవసరం, భక్తుల సౌకర్యాన్ని వివరిస్తూ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పలుమార్లు రైల్వేశాఖ మంత్రికి లేఖలు రాయడంతోపాటుగా ప్రత్యేకంగా కలిసి ఈ విషయంలో చొరవతీసుకోవాలని కోరారు. దీని సాధ్యాసాధ్యాలపై చర్చించిన రైల్వేశాఖ కొమురవెల్లి మల్లన్న జాతర సందర్భంగా రైల్వే హాల్ట్ స్టేషన్ నిర్మాణానికి అంగీకారం తెలిపింది. 

లక్డారం – దుద్దెడ స్టేషన్ల మధ్యన కొమురవెల్లిలో కొత్త హాల్ట్ స్టేషన్ నిర్మాణానికి పచ్చ జెండా ఊపుతూ రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది.
రైల్వే అధికారుల నిర్ణయం పట్ల కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జాతర ప్రారంభానికి ముందుగా కొమురవెల్లి మల్లన్న భక్తులకు మోదీ ప్రభుత్వం అందించిన కానుక ఈ రైల్వేస్టేషన్ అని తెలిపారు. 

మల్లన్న భక్తులకు రైల్వేమార్గం త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తున్నామని, రైల్వేస్టేషన్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలియజేశారు. మల్లన భక్తుల తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లకు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.

సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ప్రతి ఏటా. సంక్రాంతి సమయంలో ప్రారంభమై, ఉగాది వరకూ జరిగే మల్లన్న జాతర చాలా వైభవంగా జరుగుతుంది. ఈ జాతరకు లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు.  సుదూరప్రాంతాల నుంచి ఇక్కడికొచ్చే భక్తుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్ ఉంటే బాగుంటుందనేది దీర్ఘకాలంగా చర్చ జరుగుతోంది. దీంతో భక్తుల సౌకర్యార్థం రైల్వేలైను ఏర్పాటు, రైల్వే స్టేషన్ నిర్మాణంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవడం తో ఈ ప్రాజెక్టు సాధ్యమైంది.