ఏడంచెల భద్రతా వలయంలో అయోధ్య

 
* ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌తో భ‌ద్ర‌త ప‌ర్య‌వేక్ష‌ణ‌
 
ఈ నెల 22న రామ‌మందిరం ప్రాణ‌ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మం నేప‌థ్యంలో అయోధ్య‌లో ఎలాంటి అవాంఛనీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అయోధ్య‌లో పోలీసులు హైఅల‌ర్ట్ ప్ర‌క‌టించారు. 12 వేల మంది పోలీసుల‌తో పాటు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌తో భ‌ద్ర‌త ప‌ర్య‌వేక్షిస్తున్నారు. 
అయోధ్య‌లో ముగ్గురు అనుమానిత ఉగ్ర‌వాదుల‌ను పోలీసులు అరెస్టు చేసిన క్ర‌మంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేర‌కు భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు.
సంపూర్ణ భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర‌ ప్రభుత్వాల భద్రతా సంస్థలు కలిసి ఏడంచెల భద్రతా వలయాన్ని సిద్ధం చేశాయి. మొదటి సర్కిల్‌లో ఆధునిక ఆయుధాలతో ఎస్‌పీజీ కమాండోలు.. రెండో సర్కిల్‌లో ఎన్ ఐఏ సిబ్బంది ఉంటారు.  మూడో సర్కిల్‌లో ఐపీఎస్ అధికారులు భద్రతా బాధ్యతలు చేపట్టనున్నారు.  నాల్గవ సర్కిల్‌కు సీఆర్‌పీఎఫ్‌ సైనికులు బాధ్యత వహిస్తారు. ఐదో సర్కిల్‌లో యూపీ ఏటీఎస్‌కు చెందిన కమాండోలు సిద్ధంగా ఉంటారు. ఆరో సర్కిల్‌లో ఐబీ సిబ్బంది, ఏడో సర్కిల్‌లో స్థానిక పోలీసు సిబ్బందిని నియమించనున్నారు.
 
సైబ‌ర్ నేర‌గాళ్ల ముప్పును ఎదుర్కొనేందుకు హై లెవ‌ల్ సైబ‌ర్ ఎక్స్‌ప‌ర్ట్ టీమ్‌ను కేంద్ర హోంశాఖ అయోధ్య‌కు పంపించింది. ఇక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్స్‌ను కూడా అయోధ్య‌లో ఏర్పాటు చేశారు. బెదిరింపుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి, చ‌ర్య‌లు తీసుకోనుంది సైబ‌ర్ ఎక్స్‌ప‌ర్ట్ టీమ్. అనుమానాస్ప‌ద చ‌ర్య‌ల‌ను గుర్తించేందుకు తొలిసారిగా సెక్యూరిటీ సంస్థ‌లు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ స‌ర్వైలెన్స్ సిస్ట‌మ్‌ను ఉప‌యోగించుకుంటున్నాయి.

7 వేల మందికి పైగా విశిష్ట అతిధులతో పాటు అయిదు నుంచి ఎనిమిది ల‌క్ష‌ల మంది భ‌క్తులు హాజరవుతున్న కారణంగా అయోధ్యలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆకాశం నుంచి భూమి వరకు కట్టుదిట్టమైన నిఘా, భద్రతా ఏర్పాట్లు చేశారు. పైన డ్రోన్ల నుండి భద్రతా పర్యవేక్షణ చేయ‌నున్నారు.  అయోధ్య సిటీ వ్యాప్తంగా 10 వేల సీసీటీవీ కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 400 కెమెరాలు రామ‌మందిరం ప‌రిస‌రాల‌తో పాటు ఎల్లో జోన్‌లో ఏర్పాటు చేశారు.

ఈ ఎల్లో జోన్‌లో మొదటిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ కోసం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నామ‌ని ఉత్తరప్రదేశ్ లా అండ్ ఆర్డర్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. నేరస్థులను గుర్తించ‌డానికి, స‌రిపోల్చ‌డానికి యూపీ క్రిమిన‌ల్ డేటాబేస్‌ను పోర్ట‌ల్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.  వీటితో పాటూ ప్రత్యేక శిక్షణ పొందిన భద్రతా సిబ్బందిని కూడా పెద్ద సంఖ్యలో మోహరించనున్నారు. వీరి దగ్గర ఆటోమేటిక్ ఆయుధాలుంటాయని చెబుతున్నారు.

ఎస్ పి జి నుండి ఎటిఎస్ వరకు ప్రత్యేక కమాండోలను తీసుకురానున్నారు. వైమానిక దాడిని ఎదుర్కోవటానికి యాంటీ- డ్రోన్ సిస్టమ్‌ల నుండి కృత్రిమ మేధస్సుతో కూడిన కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ల వరకు అన్నిటినీ ఏర్పాటు చేస్తున్నారు.  పూర్తి సంరక్షణ కోసం 24 గంటలపాటు సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 6 కంపెనీలు, పీఏసీకి చెందిన మూడు కంపెనీలు, ఎస్‌ఎస్‌ఎఫ్‌కు చెందిన తొమ్మిది కంపెనీలు, ఏటీఎస్‌, ఎస్‌టీఎఫ్‌కు చెందిన ఒక్కో యూనిట్‌ను పెట్టినట్టు ఎస్పీ ప్రవీణ్‌రంజన్ తెలిపారు.  

వీరితో పాటు 300 మంది పోలీసులు, 47 మంది అగ్నిమాపక సిబ్బంది, 40 మంది రేడియో పోలీసు సిబ్బంది, 37 మంది లోకల్ ఇంటెలిజెన్స్, 2 బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ టీమ్‌లు, 2 యాంటీ సెబోటేజ్ స్క్వాడ్ టీమ్‌లను రప్పిస్తున్నారు. ఆలయానికి వెళ్లే అన్ని రహదారులు, కూడళ్లలో వారిని మోహరిస్తారు.

ప్రాణ ప్రతిష్ట చేయడానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. ముగ్గురు డీఐజీలు, 17 మంది ఎస్పీలు, 40 మంది ఏఎస్పీలు, 82 మంది డీఎస్పీలు, 90 మంది ఇన్‌స్పెక్టర్లతో పాటు 1000 మందికి పైగా కానిస్టేబుళ్లు, 4 కంపెనీ పీఏసీలు పీఎం సెక్యూరిటీ సర్కిల్‌లో పెట్టనున్నారు. 

వీటన్నిటితో పాటూ స్నిపర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సరయూ నది ఒడ్డున స్నిపర్‌లను పెట్టనున్నట్లు ఉత్తరప్రదేశ్ డీజీ ప్రశాంత్త్ కుమార్ తెలిపారు. అయోధ్యలో ఇంతకు ముందెప్పుడూ ఇంత పెద్ద కార్యక్రమం జరగలేదని, ఇప్పుడు జరిగేది దేశ చరిత్రలో నిలిచిపోయేదని అందుకే ఇంతలా ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్నారు.