పేద‌రిక నిర్మూల‌న‌కు స్ఫూర్తిగా రామ్ జ్యోతి వెలిగించండి

అయోధ్యలో ఈనెల 22న రామాల‌యం ప్రారంభోత్స‌వ వేడుక‌ల రోజున ప్ర‌జ‌లంద‌రూ త‌మ ఇండ్ల‌లో జ్యోతిని వెలిగించాల‌ని, రామ జ్యోతితో త‌మ జీవితాల్లో పేద‌రికం తొల‌గిపోయేందుకు స్ఫూర్తిదాయ‌కంగా నిలుస్తుంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు.  ప్రజల జీవితాలలో నుంచి పేదరికం నిర్మూలనకు అది స్ఫూర్తిదాయకం కాగలదని ప్రధాని తెలిపారు.

ప్ర‌ధాని శుక్ర‌వారం షోలాపూర్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ దేశంలో ఎన్నో ఏండ్ల కింద‌టే గ‌రీబీ హ‌ఠావో నినాదాలు వినిపించినా పేద‌రికం మాత్రం తొల‌గిపోలేద‌ని విచారం వ్యక్తం చేశారు.  నిజాయతీతో పాలన సాగించాలనే శ్రీరాముని సిద్ధాంతాలే తన ప్రభుత్వానికి ప్రేరణ అని స్పష్టం చేశారు.

ప్రపంచంలోని మూడు ఆగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో భారత్‌ను ఒకటి చేయడం ‘మోడీ గ్యారంటీ’ అని, తన మూడవ హయాంలో ప్రజల ఆశీస్సులతో దానిని సాఫల్యం చేయగలనని మోదీ ప్రకటించారు. ‘మోదీ గ్యారంటీ’ అంటే ‘గ్యారంటీ పూరీ హోనే కీ గ్యారంటీ’ అని, చేసిన వాగ్దానాలను గౌరవించాలని శ్రీరాముడు మనకు నేర్పించారు. పేదల సంక్షేమానికి, వారి సాధికారతకు మనం నిర్ధారించిన లక్షాలు అన్నిటినీ నెరవేరుస్తున్నాం’ అని ఆయన చెప్పారు. 

మహారాష్ట్రలో సుమారు రూ. 2000 కోట్లు విలువ చేసే ఎనిమిది అమృత్ ప్రాజెక్ట్‌లకు సోలాపూర్‌లో శంకుస్థాపన చేసిన అనంతరం జనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘మహారాష్ట్రలో పిఎంఎవై అర్బన్ కింద పూర్తి చేసిన 90 వేల పైచిలుకు గృహాలను ప్రధాని జాతికి అంకితం చేశారు.

సోలాపూర్‌లో రాయ్‌నగర్ హౌసింగ్ సొసైటీలో 15 వేల ఇళ్లను కూడా ప్రధాని అంకితం చేశారు. ఆ ఇళ్ల లబ్ధిదారులలో వేలాది మంది చేనేత కార్మికులు, విక్రేతలు, మరమగ్గాల కార్మికులు, చెత్త ఏరే శ్రామికులు, బీడీ కార్మికులు, డ్రైవర్లు ఉన్నారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు అటువంటి ఇళ్లలో బస చేసే అవకాశం తనకు వచ్చి ఉంటే బాగుండేదని తాను ఆశించినట్లు ప్రధాని గద్గద స్వరంతో చెప్పారు.

‘ప్రజల కలలు నెరవేరినప్పుడే ఆనందం కలుగుతుంది. వారి ఆశీస్సులే నా బడా పెట్టుబడి’ అని మోదీ పేర్కొన్నారు. ఇళ్లు పొందినవారు అయోధ్య రామ్ మందిర్ ప్రతిష్ఠాపన రోజు సోమవారం (22న) రామ్ జ్యోతి వెలిగించాలని ప్రధాని విజ్ఞప్తి చేస్తూ, అలా చేయడం వారి జీవితాలలో నుంచి పేదరికం నిర్మూలనకు ప్రేరణ కాగలదని చెప్పారు. 

‘శ్రీరాముడు తన ప్రజలకు ఆనందం చేకూర్చే పని చేశారు. నిరుపేదల సంక్షేమానికి, సాధికారతకు నా ప్రభుత్వం అంకితం అయింది. వారి ఇక్కట్లు తీర్చడానికి మేము పథకాలు ప్రారంభించాం’ అని ప్రధాని తెలిపారు. అయోధ్య‌లో నూత‌న రామాల‌యంలో శ్రీరాముడి ప్రాణ ప్ర‌తిష్ట‌తో ద‌శాబ్ధాల పాటు అనుభ‌వించిన వేదన స‌మ‌సిపోయింద‌ని పేర్కొన్నారు. 

గ‌తంలో భ‌క్తులు టెంట్ నుంచి రామ్ ల‌ల్లా ద‌ర్శ‌నం చేసుకునేవార‌ని చెప్పారు.  అయోధ్య‌లో దివ్య‌భ‌వ్య రామాల‌య నిర్మాణంతో భ‌క్తుల చిర‌కాల స్వ‌ప్నం నెర‌వేరింద‌ని మోదీ తెలిపారు.