అద్భుత మెజారిటీతో మూడోసారి ప్రధానిగా మోదీ

ఎవరూ ఊహించని రీతిలో అద్భుత మెజారిటీతో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారని మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్​ సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం ఆయన వరంగల్, హనుమకొండ జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు అనేక సమస్యలను పరిష్కరించిందని తెలిపారు. 
 
ఈ ప్రభుత్వం  అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అగ్రపథాన నడిపిస్తోందని చౌహాన్​  చెప్పారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడిన ఘనత ప్రధాని మోదీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. స్వదేశంలోనే వ్యాక్సిన్ ను తయారుచేసుకునేలా ఎంతగానో కృషి చేశారని చెప్పారు. 
 
అంతేగాకుండా బ్రిటీష్​ హయాంలోని 500 చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలను రూపొందించుకున్నామని గుర్తు చేశారు. 500 ఏళ్లుగా అయోధ్య రామమందిరం పునర్నిర్మాణం కోసం వేలాది మంది ప్రాణత్యాగం చేశారని, కానీ ఇప్పుడు ఒక్క రక్తపు బొట్టు కూడా చిందకుండా ప్రశాంత వాతావరణంలో మోదీ ప్రభుత్వం అయోధ్య రామమందిరం నిర్మిస్తోందని చౌహన్ తెలిపారు.

వచ్చే 25 సంవత్సరాలు భారతదేశపు అమృతకాలమని చెబుతూ భారతదేశంలోని యువత ప్రపంచమంతా రాణిస్తున్నారని థెయ్ల్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందేలా కృషి చేస్తోందని, ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరువ చేయడమే వికసిత్​ భారత్ సంకల్ప్ యాత్ర లక్ష్యమని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్​ తొందర్లోనే విశ్వగురువు స్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, తెలంగాణలో బీఆర్​ఎస్​ ప్రభుత్వ దుకాణం బంద్​ అయ్యిందని, కాంగ్రెస్​ పార్టీ అమలు సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారాన్ని దక్కించుకుందని శివరాజ్​ సింగ్​ చౌహాన్​ విమర్శించారు. దేశంలో కొన్ని కుటుంబ పార్టీలు ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నాయని, అలాంటి కుటుంబ పార్టీ నుంచి విముక్తి చెందేలా సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని పిలుపిచ్చారు.

తెలంగాణలో బీజేపీ బలం, బలగం, బాధ్యత పెరిగాయని చెబుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పార్టీ నేతలకు సూచించారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనను అందిస్తూ మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేలా పాలనసాగిస్తున్నారని, యువతను ప్రోత్సహించడంతో పాటు భారతీయ సంస్కృతి, జీవన విధానాలను భావితరాలకు అందించేందుకు పాటుపడుతున్నారని వివరించారు.