అయోధ్యలో ఉగ్రదాడి ప్రమాదం … నిఘా సంస్థలు అప్రమత్తం

అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 22వ తేదీన వేలాది మంది అతిథులు హాజరవనున్న దృష్ట్యా ఉగ్రదాడి జరగవచ్చని నిఘా వర్గాలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. రాజకీయ నేతలు, అధికారులపై దాడి చేసి అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తారని తెలిపాయి.

ఇజ్రాయెల్- హమాస్ ఘర్షణలో భారత్ ఇజ్రాయెల్ వైపు నిలబడిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వ వైఖరి ఉగ్రవాదులు దాడి చేసేందుకు ఉసిగొల్పి ఉంటుందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఐబీ హెచ్చరికలతో ఉత్తరప్రదేశ్ అధికారులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రామ జన్మభూమి ప్రారంభ వేడుకల కోసం విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు.

అయోధ్యతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని మిగిలిన చోట్ల కూడా దాడులు చేయాలని ఉగ్రవాదులు వ్యూహ రచన రచించాయని ఐబీ అధికారులు సమాచారం ఇచ్చారు. అంతర్జాతీయ సమాజంలో భారత్‌ను తక్కువ చేసే ప్రయత్నాల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో పలు పోస్టులు సిద్దం చేశారని వెల్లడించారు. దానితో అయోధ్య ప్రతిష్ఠాపన వేడుకకు ముందస్తుగా ఎటువంటి ఉగ్రముప్పులనైనా తిప్పి కొట్టేందుకు వీలుగా విస్తృత భద్రతా ఏర్పాట్లను  అయోధ్యలో సిద్ధం చేశారు. 

ఐబీ హెచ్చరికలతో అయోధ్యలో 1500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయోధ్యలో యెల్లో జోన్‌లో ఫేస్ రిగక్నిషన్ టెక్నాలజీతో కూడిన 10,715 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు అమర్చారు. వీటిని ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్‌తో అనుసంధానించారు. పైగా డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.

సెంట్రల్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తారు. వైమానిక దాడుల నుంచి రక్షణ కోసం యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉపయోగిస్తున్నారు. దీనిని ఉత్తర ప్రదేశ్ ప్రత్యేక భద్రతా  దళం (ఎస్ఎస్ఎఫ్) పర్యవేక్షిస్తుంది. ఎటువంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనే సామర్థ్యాలను బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్ డి ఆర్ ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్ డి ఆర్ ఎఫ్) దళాలను మోహరించారు. 

ఎస్ డి ఆర్ ఎఫ్ దళాలు సాధారణ పడవ గస్తీని నిర్వహిస్తాయి. లైఫ్ జాకెట్లు, నావిగేటర్లకు తప్పనిసరి  ఐడి కార్డ్‌లు వంటి భద్రతా చర్యలను అమలు చేస్తాయి. మత్తు పదార్ధాలను ఏ రూపంలోనైనా నిషేధించారు. వేడుకల సందర్భంగా నీటి నిఘాను పెంచే లక్ష్యంతో జనవరి 20 నాటికి నాలుగు క్రూయిజ్ బోట్‌ల ఏర్పాటు చేస్తున్నారు.

అయోధ్య రైల్వే స్టేషన్‌లో జనవరి 27 నుంచి ఫిబ్రవరి 15 వరకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ భద్రతను పెంచడం గమనార్హం. అదనంగా, ఏదైనా ఊహించని సంఘటనలకు తక్షణ ప్రతిస్పందనల కోసం అన్ని డేరా నగరాల్లో అగ్నిమాపక దళం నిబంధనలు అమలు చేస్తున్నారు. బయటి వ్యక్తుల కోసం కఠినమైన ధృవీకరణ విధానాలతో సహా నగర వ్యాప్త పోలీసు పెట్రోలింగ్ భద్రతా చర్యలను మరింత మెరుగు పరుస్తున్నారు.