కళ్యాణ్ సింగ్ పదవీ త్యాగంతోనే నేడు భవ్యమైన రామ మందిరం

గతంలోని వలస పాలకుల నుండి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కేంద్రంలో, ఉత్తర ప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వాలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన కారణంగానే అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణంకు సుదీర్ఘ పోరాటం జరపాల్సి వచ్చింది. చివరకు 1992లో రెండోసారి `కరసేవ’ జరిగినప్పుడు ఉత్తర ప్రదేశ్ లో కల్యాణ సింగ్ ప్రభుత్వం ఉండడంతో `బానిస సంకెళ్ళ’కు చిహ్నంగా మారిన వివాదాస్పద బాబరీ మసీదు నిర్మాణం నేలమట్టం కావడం చారిత్రక పరిణామం.
 
చరిత్రలో `మరోవిధంగా’ జరిగి ఉంటె? అనే ప్రశ్నలకు ఆస్కారం ఉండదు. కానీ ఆ నాడు అక్కడ కల్యాణసింగ్ ప్రభుత్వం లేకుండా ఉంటె ఆ చరిత్రక ఘట్టం జరిగి ఉండేదా? అని ఈ నాడు ప్రశ్నించుకుంటే కీలకమైన ఆ చారిత్రక మలుపుకు తన ముఖ్యమంత్రి పదవిని సహితం తృణప్రాయంగా త్వజించిన ఆయన అసమాన త్యాగం గుర్తుకొస్తుంది. 
 
ఒక వంక బాబ్రీ నిర్మాణం నేలమట్టం అవుతుండగా ఆ జనసందోహం మధ్యలో ఉన్న కల్యాణసింగ్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని పివి నరసింహారావు ప్రభుత్వం తొలగించడం తెలిసిందే.    ఈ చారిత్రక ఘట్టమే అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. బాబ్రీ నిర్మాణం అక్కడే కొనసాగి ఉంటె ఆలయ నిర్మాణం అంత సులభంగా సాధ్యం అయి ఉండెడిది కాదనడంలో సందేహం లేదు. 
 
హిందువులను అనాగరిక పద్ధతులతో అణిచివేసేందుకు ప్రయత్నించిన విదేశీ దండయాత్రకు చిహ్నంగా బాబ్రీ నిర్మాణాన్ని చూడడం వల్ల ఇది హిందువుల ‘విశ్వాసం’పై తీవ్రమైన దాడిగా, ఓ తీవ్రమైన `కళంకం’గా కొనసాగి ఉండెడిది. 1992 కరసేవ సమయంలో కళ్యాణ్ సింగ్ నిర్ణయం, వహించిన పాత్ర నిర్ణయాత్మకమైనందున రామజన్మ భూమి ఆందోళనలో ఓ కీలకమైన యోధుడిగా చరిత్రలో ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు.
 
బహుశా మరే రాజకీయ నాయకుడు కూడా అంతటి చారిత్రక పాత్ర వహించారని చెప్పలేము. 1992లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కళ్యాణ్ సింగ్ ఉండడంతో కరసేవకులపై  ఎట్టి పరిస్థితులలో కాల్పులు జరపరాదని స్పష్టమైన  నిర్ణయం తీసుకోవడం సాధ్యమైంది. రాజ్యాంగబద్ధంగా శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున ఈ విషయంలో ఎవరూ ఆయనను ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది.
 
అందుకనే, కళ్యాణ్ సింగ్ భగవాన్ రామ్‌పై ప్రగాఢ విశ్వాసం ఉన్న హిందువు కావడంతో కాల్పులకు ఆదేశించలేదు. కాల్పులకు ఆదేశించడం  అంటే హిందువులపై అత్యంత తీవ్రమైన నేరానికి పాల్పడుతున్నట్లు కాగలదనే కళ్యాణ్ సింగ్ ఆనాడు భావించి ఉండాలి. కరసేవకులపై కాల్పులు జరపడం 500 సంవత్సరాలకు పైగా సాగుతున్న రామజన్మ భూమి పోరాటాన్ని మరింత క్లిష్టతరం చేస్తుందని కళ్యాణ్ సింగ్ భావించి ఉండాలి.
 
అప్పటి యూపీ ప్రభుత్వం అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకొని ఉంటె ఏదైనా తీవ్రమైన చర్య ఆలయ నిర్మాణాన్ని నిరవధికంగా వాయిదా వేసేది. వేలాది మంది కరసేవకులు అయోధ్య వైపు వెళుతున్నప్పుడు కళ్యాణ్ సింగ్ ఎలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొని ఉంటారో ఊహించడం కష్టం కాబోదు. కరసేవ కేవలం జాతీయ రాజకీయాల్లో కేంద్ర బిందువుగానే కాకుండా అంతర్జాతీయ దృష్టిని కూడా ఆకర్షించింది.
 
గుర్తుంచుకోండి, అప్పుడు ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. ఓ సాధారణ పార్టీ కార్యకర్త కాదు. బాబ్రీ నిర్మాణాన్ని ఎలాగైనా కాపాడాలని కళ్యాణ్ సింగ్ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. బాబ్రీ కట్టడాన్ని పరిరక్షిస్తామని హామీ ఇస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించింది.  నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ (ఎన్‌ఐసి) సమావేశంలో కళ్యాణ్ సింగ్ కూడా ఇదే హామీ ఇచ్చారు. బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు బాబ్రీ నిర్మాణాన్ని రక్షించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ, కళ్యాణ్ సింగ్ తనదైన నిర్ణయం తీసుకున్నారు. 
 
హిందూ ధర్మం పట్ల తనకున్న నమ్మకం, నిబద్ధత కారణంగానే ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకోగలిగారు. కళ్యాణ్ సింగ్ అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు. తాను తీసుకొనే నిర్ణయం పర్యవసానాల గురించి బాగా అవగాహన గల నేత కూడా. తన పదవికి ఆ నిర్ణయం ముప్పు తేగలదని ఊహించలేని అమాయకులు కారు. 
 
కరసేవకులపై కాల్పులు జరపడానికి నిరాకరిస్తే రాగాల ఫలితాలు క్లిష్టమైన రాజ్యాంగ, రాజకీయ, సామాజిక పరిణామాలకు సంబంధించినవి కాగలవు.  బాబ్రీ నిర్మాణానికి ఏదైనా జరిగితే తాను వ్యక్తిగతంగా తీవ్రమైన కోర్టు ధిక్కార కేసును ఎదుర్కోవాల్సి వస్తుందన్న వాస్తవాన్ని కళ్యాణ్ సింగ్ తప్పనిసరిగా గ్రహించి ఉండాలి.
 
ఏదేమైన్నప్పటికీ, కరసేవకులపై కాల్పులు జరపకూడదన్న తన వైఖరిలో దృఢంగా ఉండేందుకు ఆయన ఎటువంటి సంశయాలను, భయాలను దరిచేరనీయలేదు. డిసెంబర్ 6, 1992 సాయంత్రం, కళ్యాణ్ సింగ్ అయోధ్యలో జరిగిన దానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలిగారు.
అన్ని రాజకీయ పరిగణనలకు అతీతమైన భావజాలానికి నిబద్ధతతో వ్యవహరించారు. ఆ సమయంలో కళ్యాణ్ సింగ్ ముందు రెండే రెండు స్పష్టమైన మార్గాలున్నాయి.
మొదటిది, ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం లేదా రెండోవది కరసేవకుల ప్రాణాలను రక్షించడం. కరసేవకుల ప్రాణాలను కాపాడిన ఆయన ముఖ్యమంత్రి పదవి గురించి పట్టించుకోలేదు. మొదటిసారి కరసేవ జరిగినప్పుడు ఉన్న ములాయంసింగ్ ప్రభుత్వం ఎంత కర్కశంగా వ్యవహరించి, విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఎందరో కరసేవకుల ప్రాణాలను బలితీసుకోవడం తెలిసిందే.
 
అయితే, రామజన్మ భూమి విముక్తికి మించిన రాజకీయ పరిణామాల గురించి కళ్యాణ్ సింగ్ పట్టించుకోలేదు. ఇది హిందూ ధర్మం పట్ల ఏర్పర్చుకున్న అచంచలమైన నిబద్ధత ఫలితం. కళ్యాణ్ సింగ్ తన నిర్ణయం పట్ల ఎప్పుడూ పశ్చాత్తాప పడలేదు. చివరి శ్వాస వరకు తన నిర్ణయాన్ని సమర్ధించుకొంటూ ఉన్నారు. 
 
 ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కళ్యాణ్ సింగ్ మాట్లాడుతూ, “నేను ముఖ్యమంత్రిగా ఉన్నందున ఈ నిర్మాణాన్ని కూల్చివేయాలని నిర్ణయించబడి ఉండవచ్చు” అని అన్నారు. కూల్చివేత జరగకపోతే, బహుశా కోర్టులు కూడా యథాతథ స్థితిని ఆదేశించి ఉండేవని కళ్యాణ్ సింగ్ చెప్పడం గమనార్హం. పైగా, ఆనాడు అయోధ్యలో జరిగిన పరిణామాలకు తానే బాధ్యత వహించారు. అధికారులపై నెట్టే ప్రయత్నం చేయలేదు.
 
ఈ సందర్భంగా అలహాబాద్ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ఆ నాడు అధికారులు అందరూ తన ఆదేశాలనే పాటించారని, అక్కడ జరిగిన పరిణామాలకు తానే బాధ్యుడిని అని స్పష్టంగా చెప్పారు. ఏదైనా శిక్ష విధించాల్సి వస్తే తనకే వేయమని కూడా తేల్చి చెప్పారు. సాధారణంగా రాజకీయ నాయకులూ అందరూ ఇతరులపై బాధ్యతలు నెట్టివేసి పరిణామాల నుండి తప్పించుకొనే ప్రయత్నం చేస్తుంటారు.
 
కళ్యాణ్ సింగ్ సంకల్పం ఎంతో ధృడమైనది కూడా. బాబ్రీ నిర్మాణాన్ని కూల్చివేసినందుకు మీరు సిగ్గుపడుతున్నారా? అని ఒకసారి అడిగారు. “స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రామజన్మ భూమికి తాళం వేయడం జాతీయ అవమానం, బాబ్రీ నిర్మాణాన్ని కూల్చివేయడం కాదు’’ అంటూ ఎంతో స్వాభిమానంతో ఆయన సమాధానమిచ్చారు.
 
ఆయన తన జీవితమంతా ఆ రోజున కాల్పులు జరపకుండా రామభక్తుల ప్రాణాలను కాపాడినందుకు గర్వపడుతూనే గడిపారు. భగవాన్ రామ్‌పై తనకున్న ప్రగాఢ విశ్వాసానికి మరోసారి సూచికగా, రామజన్మభూమి వద్ద ఆలయాన్ని నిర్మించడం ద్వారా బాబ్రీ నిర్మాణం ఉనికి ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పడానికి ఆయన ఎప్పుడూ వెనుకాడలేదు.
 
గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన తర్వాత కళ్యాణ్ సింగ్ గర్వంగా బయటకు వెళ్లారని, ఆయన ముఖంలో ఎలాంటి అపరాధభావం లేదని అప్పటి ఆయన సహచర రాజకీయ నేతలు ఇప్పటికి గుర్తు చేసుకొంటుంటారు. రామజన్మ భూమి ఆందోళనలో నిర్ణయాత్మక పాత్ర వహించడమే కాకుండా, దేశంలో బిజెపికి సామజిక మద్దతు పరిధులను సంప్రదాయ పరిమితులను దాటి విస్తరింప చేయడంలో సహితం కీలక పాత్ర వహించారు.
 
గత పదేళ్లుగా కేంద్రంలో, పలు రాష్ట్రాల్లో బిజెపి సంపూర్ణ ఆధిక్యతతో తిరుగులేని అధికారాన్ని నిలబెట్టుకో గలుగుతున్నదంటే ఆనాడు కళ్యాణ్ సింగ్ విస్తరించిన సామజిక పరిధి అని చెప్పవచ్చు. మండల్ ఆందోళన నేపథ్యంలో కళ్యాణ్ సింగ్ నాయకత్వం ఉద్భవించింది. వామపక్షాలు ‘మండలం- కమండలం’ మధ్య పోరాటంగా చిత్రీకరించడానికి ప్రయత్నించాయి.
 
కానీ కళ్యాణ్ సింగ్ `మండల్, కమండల్’ ల ఖచ్చితమైన కలయిక అని వారికి తెలియదు. కులాల కారణంగా హిందువులు విడిపోయే అవకాశం ఉన్నప్పుడే ఆయన నాయకత్వం ఉద్భవించింది. అత్యధిక జనాభా కలిగిన,  రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ఐక్యతను కొనసాగించడంలో కళ్యాణ్ సింగ్ కీలక పాత్ర పోషించారు.
 
ములాయం సింగ్ యాదవ్, కాన్షీరామ్ వంటి బలమైన ప్రత్యర్థులను దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్‌కు బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడాన్ని బట్టి ఆయన పలుకుబడి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. హిందూ వ్యతిరేక రాజకీయ శక్తులచే సోకాల్డ్ సోషల్ ఇంజనీరింగ్‌ను ఎదుర్కోవడంలో కళ్యాణ్ సింగ్ నాయకత్వం కీలకపాత్ర పోషించింది.
 
ఈ సోషల్ ఇంజనీరింగ్ కులాలను పరస్పరం వ్యతిరేకించడమే తప్ప మరొకటి కాదు. కానీ కళ్యాణ్ సింగ్ నాయకత్వం ఈ ధోరణికి అడ్డుకట్ట వేసింది.  ఇది భారత రాజకీయాలపై దీర్ఘకాల ప్రభావం చూపింది. ఆగస్ట్ 5, 2020న రామజన్మ భూమి ఆలయానికి ప్రధానమంత్రి శిలాన్యాస్ చేసినప్పుడు కళ్యాణ్ సింగ్ అక్కడ ఉన్నారు. 
 
ఆ సందర్భంగా ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. రామజన్మ భూమి ఆలయాన్ని చూడాలన్నదే తన కోరిక అని అప్పుడు చెప్పారు.  దురదృష్టవశాత్తూ, అయోధ్య పవిత్రోత్సవం చారిత్రాత్మక క్షణానికి కళ్యాణ్ సింగ్ ఉండరు. అయితే తాను వహించిన నిర్ణయాత్మక పాత్రతో ఎప్పటికీ గుర్తుండిపోతారు.
 
కళ్యాణ్ సింగ్ మరణానంతరం, ప్రధాని నరేంద్ర మోదీ తన సంతాపాన్ని తెలియజేశారు, “భారతదేశ సాంస్కృతిక పునర్జీవంకు కళ్యాణ్ సింగ్ చేసిన కృషికి రాబోయే తరాలు ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుతాయి. భారతీయ విలువల్లో దృఢంగా పాతుకుపోయి, మన శతాబ్దాల పాత సంప్రదాయాల పట్ల గర్వంగా ఉంది. దేశం సాంస్కృతిక పునర్జీవం యాత్రలో నిర్వహించిన  కళ్యాణ్ సింగ్ పాత్రకు ఇది అత్యంత అర్ధవంతమైన,సముచితమైన వివరణ”.