కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఇడి దాడులు

మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కె వై నంజెగౌడ నివాసాలు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సోమవారం దాడులు జరిపింది. 61 సంవత్సరాల నంజెగౌడ కోలార్ జిల్లాలోని మాలూర్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఎఎంఎల్‌ఎ చట్టం కింద మాలూర్, కోలార్‌లోని ఎమ్మెల్యేకు చెందిన నివాసాలు, ఆయనకు సంబంధమున్న వారి కార్యాలయాలు, ఇళ్లలో ఇడి అధికారులు సోదాలు జరుపుతున్నట్లు వర్గాలు తెలిపాయి.

నంజెగౌడ అధ్యక్షుడిగా ఉన్న కోలార్-చిక్కబళ్లాపూర్ జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘంలో సిబ్బంది నియామకాలలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై స్థానిక పోలీసులు నమోదు చేసిన ఎప్‌ఐఆర్‌లతోపాటు మరి కొన్ని ఇతర ఆరోపణలను ఆధారంగా చేసుకుని ఇడి మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. 

కోలార్‌లోని పాల సహకార సంఘం ప్లాంట్‌తోపాటు కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతున్నట్లు వర్గాలు తెలిపాయి. కర్నాటకలోనే రెండవ అతిపెద్ద పాల ఉత్పత్తి సంఘంగా కెఓఎంయుఎల్ ఉంది. 11 రెవెన్యూ తాలూకాలలోని 2,919 గ్రామాలు గల కోలార్, చిక్కబళ్లాపూర్ జిల్లాలలో ఈ సంఘం కార్యకలాపాలు విస్తరించి ఉన్నాయి.