వేగంగా దూసుకుపోతున్న భారత్.. ఐరాస

భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని ఐక్యరాజ్యసమితి ఆర్థిక రిపోర్టులో పేర్కొంది. యూఎన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక‌నామిక్స్ అండ్ సోష‌ల్ అఫైర్స్ రిపోర్టు ప్రకారం భారత ఆర్థిక వృద్ధి 2024లో 6.2 శాతం ఉంటుందని తేలింది.  2024లో భార‌త ఆర్థిక వృద్ధి 6.2 అని పేర్కొన్నా అది అంచ‌నా వేసిన 6.3 శాతం క‌న్నా స్వ‌ల్పంగా త‌క్కువ‌గా ఉంటుంద‌ని యూఎన్ త‌న రిపోర్టులో వెల్ల‌డించింది.
 
భారత్ అంచనాకంటే వృద్ధి శాతం కొంత తగ్గినా గణనీయమైన పురోగతి సాధిస్తుందని తెలిపింది. ఉత్పత్తి, తయారీ రంగాల్లో బలమైన వృద్ధి కారణంగా భారత్ దూసుకుపోతోందని తెలిపింది. గతేడాది దేశం అధిక పెట్టుబడులను ఆకర్షించినట్లు తెలుస్తోంది.  ప్రభుత్వ మౌలికసదుపాయాల ప్రాజెక్టుల్లో పురోగతి, విదేశీ కంపెనీల రాక బాగా పెరిగింది. 
 
2023 మూడో త్రైమాసికంలో మిగతా దేశాలతో పోల్చితే భారత్ మంచి ఫలితాలను కనబరిచింది. అభివృద్ధి చెందిన దేశాలకంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు పెట్టుబడుల్ని ఎక్కువగా ఆకర్షిస్తున్నట్లు రిపోర్టు స్పష్టం చేసింది. దక్షిణాసియాలో పెట్టుబడులకు భారత్ స్వర్గధామంగా నిలిచింది.

 
వాతావరణ మార్పు 2023లో దక్షిణాసియాలోని పలు దేశాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. జులై, ఆగస్టులో కరువులు తీవ్రమయ్యాయి. ఇవి భారత్, నేపాల్, బంగ్లాదేశ్‌ లను ప్రభావితం చేశాయి. అయితే పాకిస్తాన్‌లో సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. 2023 ఆగస్టు నాలుగు దశాబ్దాల్లో అత్యంత పొడిగా ఉన్న నెలగా నిలిచింది. తద్వారా పంట దిగుబడులపై ప్రభావం పడింది.