భారతి సిమెంట్స్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ

భారతి సిమెంట్స్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్ ఎఫ్‌డీలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. భారతి సిమెంట్స్‌కు చెందిన రూ.150 కోట్ల ఎఫ్‌డీలను ఈడీ విడుదల చేయాలంటూ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. 

హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో ఈడీ సవాల్ చేసింది. ఈడీ వాదనలతో ఏకీభవిస్తూ జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. భారతి సిమెంట్స్ ఎఫ్‌డీల స్థానంలో బ్యాంకు గ్యారంటీలు పొంది ఎఫ్‌డీలను విడుదల చేయాలన్న తీర్పును పున:పరిశీలించాలని హైకోర్టుకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

ఎఫ్‌డీలకు బదులుగా బ్యాంకు గ్యారంటీలను తీసుకున్న తరువాత కూడా ఎఫ్‌డీలను జప్తు చేసుకుందని భారతి సిమెంట్స్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఎఫ్‌డీలను జప్తు చేసినా కనీసం దానిపైన వచ్చిన వడ్డీనైనా విడుదల చేయాలంటూ భారతీ సిమెంట్స్ మరో పిటీషన్ దాఖలు చేసింది.

అయితే భారతీ సిమెంట్స్ ఐఏని కూడా సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ఎఫ్‌డీలనే విడుదల చేయాలన్న తీర్పునే పున:పరిశీలించాలనప్పుడు వడ్డీ ఎలా వస్తుందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషన్‌పై వాదనలు ముగిసినట్లే అని.. అభ్యంతరాలు ఉంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.

మరోవైపు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కూడా సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. అమరావతి ఆర్ 5 జోన్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది. వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరపాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనానికి రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి విజ్ఞప్తి చేసినప్పటికీ తోసిపుచ్చింది. అయినప్పటికీ ధర్మాసనం వాయిదా వేసింది.

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సెంటు భూమి ఇచ్చి నివాస గృహాలు నిర్మించేందుకు చేసిన ప్రయత్నాలు అడ్డుకున్నారని సింఘ్వి వాదించారు. రాజధానికి సంబంధించిన ప్రధాన పిటిషన్ ఇదే ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉందని రైతుల తరపు సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందిస్తూ ఏం జరుగుతుందో తమకు అన్ని తెలుసని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. సింఘ్వి విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. కేసు విచారణ ఏప్రిల్‌లో నాన్ మిస్లేనియస్ డే రోజు తుది విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.