అయోధ్యలో నేటి రామమందిరంకు ఆద్యుడు కె కె నాయర్

సుమారు ఐదు దశాబ్దాల పోరాటాల అనంతరం నేడు అయోధ్యలో భవ్యమైన రామ మందిరం ప్రతిష్టకు దారితీసేందుకు ఒక విధంగా ఆద్యుడు నిజాయతి గల ఐసిఎస్ అధికారి కె కె నాయర్ అని చెప్పవచ్చు. నాడు 73 ఏళ్ళ క్రితం ఎంతో బలమైన ప్రధానిగా పేరొందిన జవహర్ లాల్ నెహ్రు ఆదేశాలను సహితం ధిక్కరించి, నిర్భయంగా నిజాయతీతో తన విధులను నిర్వహించిన కారణంగానే నేడు అక్కడ ఈ చారిత్రాత్మక మందిరం ఉనికిలోకి రాగలుగుతుందని చెప్పవచ్చు.
 
నేడు సుప్రీం కోర్టు ఆ ప్రాంగణం రామమందిరందే అని స్పష్టమైన తీర్పు ఇచ్చేందుకు, తదుపరి రామమందిర నిర్మాణం చేపట్టడం అంతటికి అప్పుడెప్పుడో ఆయన ఇచ్చిన ఆదేశాలే మూలాధారం. ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన ఆదేశాలను ఏ న్యాయస్థానం గాని, ఏ ప్రభుత్వం గాని కొట్టి పారవేయ లేకపోవడం గమనార్హం.

కె కె నాయర్ అని పిలువబడే కందంగళం కరుణాకరన్ నాయర్ 1907లో సెప్టెంబర్ 7న  కేరళలోని అలప్పుజాలోని గుటన్‌కడు అనే చిన్న గ్రామంలో జన్మించారు.  భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు, ఇంగ్లాండ్ వెళ్లి 21 సంవత్సరాల వయస్సులో బారిస్టర్ అయ్యి స్వదేశానికి తిరిగి వచ్చే ముందు ఐసిఎస్ పరీక్షలో విజయం సాధించారు.

కేరళలో కొంతకాలం పనిచేసిన ఆయన నిజాయితీకి పేరుగాంచారు. ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రజల సేవకునిగా పేరు తెచ్చుకున్నారు. 1945లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ సర్వెంట్‌గా చేరారు. అతను వివిధ పదవులలో పనిచేశాడు. జూన్ 1, 1949న ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్,  జిల్లా మేజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు.

బాల రాముని విగ్రహం అయోధ్య మందిరంలో హఠాత్తుగా కనిపించిందని ఫిర్యాదు రావడంతో  విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అప్పటి ప్రధాని నెహ్రూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ అక్కడికి వెళ్లి విచారణ చేయవలసిందిగా కె.కె.నాయర్‌ను కోరగా, నాయర్ తన సబార్డినేట్ గురుదత్ సింగ్ ని దర్యాప్తు చేసి నివేదిక ఇమ్మనమని కోరాడు.

సింగ్ అక్కడికి వెళ్లి సమగ్ర నివేదికను కేకే నాయర్‌కు అందించారు. హిందువులు అయోధ్యను రాముడు (రామ్ లల్లా) జన్మస్థలంగా ఆరాధిస్తున్నారని, అది ఒక మసీదుగా ఉందని, అక్కడ ముస్లింలు సమస్యలు సృష్టిస్తున్నారని స్పష్టమైన నివేదిక ఇచ్చారు.  పైగా, అది హిందూ దేవాలయమని ఆయన నివేదిక  స్పష్టం చేసింది.  
 
అంతేకాక అక్కడ పెద్ద దేవాలయం నిర్మించాలని కూడా ఆయన సూచించారు. దాని కోసం ప్రభుత్వం భూమి కేటాయించాలని, గొడవలు జరగకుండా ముస్లింలు ఆ ప్రాంతానికి వెళ్లకుండా నిషేధించాలని ఆయన నివేదికలో పేర్కొన్నారు. ఆ నివేదిక ఆధారంగా ఆలయానికి 500 మీటర్ల పరిధిలోకి ముస్లింలు వెళ్లడాన్ని నిషేధిస్తూ నాయర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిషేధాన్ని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కానీ, కోర్టు కానీ ఎత్తివేత లేకపోవడం గమనార్హం.
ఇది విని, నెహ్రూ చిరాకు పడి కోపం తెచ్చుకుని  ఆ ప్రాంతం నుండి హిందువులను తక్షణమే ఖాళీ చేయించి రామ్ లల్లాను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. నెహ్రు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ వెంటనే హిందువులను ఖాళీ చేయించాలని, రామ్ లల్లా విగ్రహాన్ని తొలగించాలని నాయర్‌ను ఆదేశించారు.

కానీ నాయర్ ఆ ఉత్తర్వులను అమలు చేసేందుకు నిరాకరిస్తూ, మరోవైపు, రామ లల్లాకు రోజూ పూజ చేయాలని మరో ఆదేశం జారీ చేశారు. పూజకు అయ్యే ఖర్చు, పూజ చేసే పూజారి జీతం కూడా ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వు జారీ చేశారు. ఈ ఉత్తర్వుతో భయపడిన నెహ్రూ వెంటనే నాయర్‌ని ఆ పదవి నుండి తొలగించాలని ఆదేశించారు. 
 
అయితే, నాయర్ అలహాబాద్ కోర్టుకు వెళ్లి తన కేసు తానే వాదించుకుని నెహ్రూ జారీ చేయించిన తొలగింపు ఉత్తర్వులకు వ్యతిరేకంగా విజయం సాధించారు.  నాయర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అదే స్థలంలో పని చేసేందుకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశం నెహ్రూకు చెంప పెట్టు లా తగిలింది.
ఈ పరిస్థితులు లో అయోధ్య వాసులు ఎన్నికల్లో పోటీ చేయాలని నాయర్‌ను కోరారు. అయితే ప్రభుత్వోద్యోగి అయిన తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని నాయర్‌ చెప్పడంతో,  నాయర్ భార్యను అయినా పోటీ చేయాలని అయోధ్య వాసులు కోరారు.  ప్రజల అభ్యర్థనను అంగీకరిస్తూ, శ్రీమతి శకుంతలా నాయర్ ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా అయోధ్యలో జనసంఘ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.

అప్పట్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించినా అయోధ్యలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిపై నాయర్ భార్య భారీ మెజారిటీతో జనసంఘ్ అభ్యర్థిగా గెలుపొందారు. ఇది చూసి ఆశ్చర్యపోయిన నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ నాయర్‌పై ఒత్తిడి తీసుకురావడం తో నాయర్  తన పదవికి రాజీనామా చేసి అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేయడం ప్రారంభించారు. 
 
1967లో పార్లమెంటుకు ఎన్నికలు ప్రకటించబడినప్పుడు, ప్రజలు నాయర్,  ఆయన భార్యను పోటీకి ఒప్పించడంలో విజయం సాధించారు.  బహ్రైచ్, కైసర్‌గంజ్ నియోజకవర్గాలను గెలవడానికి ప్రజలు నాయర్ దంపతులకు సహాయం చేసారు. వారిది అది ఒక చారిత్రాత్మక విజయం. శకుంతల నాయర్ మొత్తంగా ఒక సారి ఎమ్మెల్యేగా, మూడు సార్లు ఎంపీగా గెలిచారు. వారిద్దరూ చివరి వరకు జనసంఘ్ కార్యకర్తలుగా ఉన్నారు.

విచిత్రం ఏమిటంటే నాయర్ పలుకుబడి ఎంత అంటే  అతని డ్రైవర్ కూడా ఫైసలాబాద్ నియోజకవర్గం నుండి రాష్ట్ర శాసనసభ సభ్యునిగా ఒకసారి ఎన్నికయ్యాడు. ఆ తర్వాత ఇందిర పాలనలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించినపుడు ఈ దంపతులను అరెస్టు చేసి, జైలులో పెట్టారు. కానీ వారి అరెస్టు అయోధ్యలో భారీ అలజడికి కారణం అవ్వడంతో భయపడిన ప్రభుత్వం వారిని జైలు నుండి వెంటనే విడుదల చేసింది.

ఆ దంపతులు అయోధ్యకు తిరిగి వచ్చి తమ ప్రజా సేవను కొనసాగించారు. స్వాతంత్య్రానంతరం అయోధ్య కేసును తొలిసారిగా పరిష్కరించింది నాయర్. ఇప్పటికీ కూడా ఆయన అధికారిగా జారీ చేసిన ఉత్తర్వులను హిందూ వ్యతిరేకులు మార్చలేకపోయారు. నాయర్ జారీ చేసిన ఆ ఆదేశాలు ఆధారంగానే పూజలు, రామ్ లల్లా దర్శనం ఇప్పటికీ కొనసాగుతోంది.

1976లో, నాయర్ కేరళలోని తన స్వగ్రామానికి తిరిగి రావాలనుకున్నాడు. అయితే ఆయన వెళ్లేందుకు ప్రజలు అనుమతించలేదు. కానీ, నాయర్ తన చివరి రోజుల్లో తన స్వగ్రామంలో ఉండాలనుకుంటున్నానని ప్రజలకు నచ్చచెప్పి వీడ్కోలు తీసుకున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ 1977 లో ఆయన తన స్వగ్రామంలో శ్రీరామచంద్రమూర్తి పాదారవిందములకు చేరుకున్నాడు.

ఆయన చితాభస్మాన్ని స్వీకరించేందుకు ఒక బృందం కేరళకు వెళ్లింది. ఆ చితాభస్మాన్ని  అలంకరించిన రథంలో ఘనంగా ఊరేగించి శ్రీరాముడు రోజూ స్నానం చేసి సూర్యుడిని ఆరాధించిన అయోధ్యలోని  సరయు నదిలో నిమజ్జనం చేసారు. నాయర్ కృషి వల్లనే అప్పటి నుండి నిరంతరాయంగా ఇప్పటి వరకు  అయోధ్యలోని శ్రీరామ జన్మ భూమిలో పూజలు చేయగలుగుతున్నాం.

అందుకనే అయోధ్య ప్రజలు ఆయనను దైవమైన వ్యక్తిగా పరిగణించడంలో ఆశ్చర్యం లేదు. ఆయన అయోధ్య విషయంలో చేసిన కృషికి గాను విశ్వ హిందూ పరిషత్ ఆయన స్వగ్రామంలో కొంత భూమిని కొని ఆయనకు స్మారక చిహ్నం నిర్మించారు. కె కె  నాయర్ పేరుతో ప్రారంభించిన ట్రస్ట్ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, శిక్షణను అందిస్తోంది.