గవర్నర్ కు అయోధ్య అక్షింతలు అందజేత

తెలంగాణ తొలి పౌరురాలు, గవర్నర్ డా.  తమిళ సై సౌందర రాజన్ కు  అయోధ్య రాముల వారి అక్షింతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు అందజేశారు. జనవరి 1 నుంచి 15వ తారీకు వరకు నిర్వహించే జన సంపర్క అభియాన్ కార్యక్రమాన్ని సోమవారం రాష్ట్ర గవర్నర్ చేత ప్రారంభింపచేశారు. 
 
అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణంతో వందల ఏళ్ల నాటి హిందువుల కల సహకారమవుతోందనీ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రతి హిందువుకు రాముల వారి అక్షింతలు అందజేసి, మందిర దర్శనానికి ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు. 
 
అందులో భాగంగానే తొలిరోజు  రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్ కు సంప్రదాయబద్ధంగా  బొట్టుపెట్టి, అక్షింతలు, కుంకుమ, పసుపు , గాజులు అందజేసి రామమందిర దర్శనానికి ఆహ్వానం పలికినట్లు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ డా. తమిళసై మాట్లాడుతూ దర్శనానికి తప్పకుండా వస్తానని తెలిపారు. 
 
ఆమె ఆనందంతో అక్షింతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జైశ్రీరామ్ నినాదాలతో రాజ్ భవన్ లో హోరెత్తించారు. రామ లక్ష్మణ జానకి.. జై బోలో హనుమాన్ కి అంటూ ప్రతిగా అక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులు అందరూ కూడా నినాదించారు.
 
రాజకీయాలకు అతీతంగా ప్రతి హిందువును అయోధ్య రామ జన్మభూమి దర్శనానికి ఆహ్వానిస్తున్నట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు చెప్పారు. జనవరి 15వ తేదీ వరకు కోట్లాదిమంది హిందువులను కలిసి అక్షింతలు అందజేసి అయోధ్యకు ఆహ్వానం పలుకుతున్నామని పేర్కొన్నారు. 
 
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పాటు ప్రతి గ్రామం, బస్తీ, పల్లె, తండా, గిరిజన ప్రదేశాలకు కూడా రాముడి అక్షింతలు చేరాయని, వాటి పంపిణీ ఈరోజుతో ప్రారంభమైందని వారు తెలియజేశారు.  కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు, విశ్వహిందూ పరిషత్ బాధ్యులు సురేందర్ రెడ్డి, పండరినాథ్, జగదీశ్వర్, డాక్టర్ రామ్ సింగ్, నరసింహమూర్తి, సునీత రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.