పురుషులకు ప్రత్యేక బస్సులు!

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చాకా ఆర్టీసీ లో రద్దీ విపరీతంగా పెరిగింది. డబుల్ ఆక్యుపెన్సీ రేషియోతో ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. అయితే ఎక్కువగా మహిళలే బస్సుల్లో ప్రయాణం చేస్తుండడంతో వెనుక సీట్ల వరకు వాళ్లే కనిపిస్తున్నారు. దీంతో సీటు దొరకడం లేదని పురుషులు దిగి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అవసరమైన రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై ఆర్టీసీ యోచిస్తోంది. వృద్ధులకు ప్రత్యేకంగా సీట్ల కేటాయింపు పైనా కసరత్తు జరుగుతోంది. మరోవైపు విద్యార్థులకు సైతం కొన్ని మార్గాల్లో సర్వీసులు నడిపే విషయాన్ని ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సీట్లలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. గతంలో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యూపెన్సీ రేషియో 69 శాతం ఉండేది. గతంలో మహిళా ప్రయాణికులు 12 నుంచి 14 లక్షలు ఉండగా.. ఇప్పుడు 29 లక్షలు దాటుతున్నట్లు ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఆక్యూపెన్సీ రేషియో దాదాపు 89 శాతం నమోదవుతుంది.