ఆస్ట్రేలియాపై భారత మహిళల క్రికెట్ జట్లు అత్యద్భుత విజయంతో చరిత్ర సృష్టించింది. ముంబైలోని వాంఖడే వేదికగా ఆదివారం ముగిసిన ఏకైక టెస్టులో పటిష్టమైన ఆసీస్ను 8 వికెట్ల తేడాతో ఓడించిన భారత్.. పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఆస్ట్రేలియాపై భారత్ (మహిళల)కు ఇదే తొలి టెస్టు విజయం.
సుదీర్ఘ ఫార్మాట్లో 40 టెస్టులు ఆడిన భారత్కు ఇది ఏడో గెలుపు. 1976 నుంచి టెస్టు క్రికెట్ ఆడుతున్న భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాను ఓడించడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. గతంలో ఆసీస్ తో పది టెస్టులు ఆడినప్పటికి నాలుగు టెస్టులు ఆస్ట్రేలియా గెలవగా ఆరు టెస్టులు డ్రాగా ముగిశాయి. పదకొండో టెస్టులో మాత్రం టీమిండియా ఘన విజయం సాధించింది.
డిసెంబర్ 24.. ఈ తేదీతో భారత క్రికెట్ జట్టుకు ప్రత్యేకమైన అనుబంధమున్నట్టుంది. ఆస్ట్రేలియాపై టెస్టులలో భారత పురుషుల జట్టు తొలి విజయం సాధించింది కూడా సరిగ్గా ఇదే రోజు. 1959లో డిసెంబర్ 24న కాన్పూర్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో నాటి భారత జట్టు ఆసీస్ను 119 పరుగుల తేడాతో విజయం సాధించింది. 64 ఏండ్ల తర్వాత సరిగ్గా అదే తారీఖున భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది.
ఆస్ట్రేలియాతో వాంఖడేలో జరిగిన టెస్ట్ ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్కు 40వ టెస్టు. 40 టెస్టుల తర్వాత రికార్డులు చూస్తే పురుషుల జట్టు కంటే మహిళల జట్టుకే మెరుగైన రికార్డు ఉంది. 1932 నుంచి 1935 మధ్య సరిగ్గా 40 టెస్టుల తర్వాత భారత్ మెన్స్ క్రికెట్ టీమ్. మూడు విజయాలు, 17 పరాజయాలు, 20 డ్రాలతో ఉంది. విజయాల శాతం 7.50 శాతం మాత్రమే.
కానీ ఉమెన్స్ క్రికెట్ టీమ్ మాత్రం 1976 – 2023 దాకా 40 టెస్టులలో ఏడు గెలిచి ఆరు ఓడింది. 27 టెస్టులను డ్రా చేసుకుంది. ఉమెన్స్ క్రికెట్ టీమ్ విజయాల శాతం 17.50గా ఉండటం గమనార్హం. భారత్ ఏకైక టెస్టు ఆడేందుకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ముంబైకి వచ్చింది. ఇరు జట్ల మధ్య వాంఖడే వేదికగా డిసెంబరు 21న మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ల దెబ్బకు 219 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది.పూజా వస్త్రాకర్ నాలుగు, స్నేహ్ రాణా మూడు, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ను కకావికలం చేశారు. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆరంభించిన భారత్కు ఓపెనర్లు షఫాలీ వర్మ 40, స్మృతి మంధాన 74 పరుగులతో అదిరిపోయే ఆరంభం అందించారు. మిడిలార్డర్లో రిచా ఘోష్ 52, జెమీమా రోడ్రిగ్స్ 73 పరుగులతో దుమ్ములేపారు.
ఇక లోయర్ ఆర్డర్లో దీప్తి శర్మ 78, పూజా వస్త్రాకర్ 47 పరుగులతో అద్వితీయ బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. ఇలా బ్యాటర్లంతా సమిష్టిగా రాణించడంతో భారత్ మొదటి ఇన్నింగ్స్లో 406 పరుగులకు ఆలౌట్ అయి ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 233 పరుగులు సాధించింది. ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని పట్టుదలగా పోరాడింది. అయితే, భారత బౌలర్ల ముందు ఆసీస్ పప్పులు ఉడకలేదు.
టాపార్డర్, మిడిలార్డర్ పర్వాలేదనిపించినా.. నాలుగో రోజు ఆటలో లోయర్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. స్నేహ్ రాణా నాలుగు వికెట్లుతో చెలరేగగా.. పూజా ఒకటి, రాజేశ్వరి గైక్వాడ్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ రెండేసి వికెట్లు పడగొట్టి ఆసీస్ను కట్టడి చేశారు. దీంతో 261 పరుగులకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ఆలౌట్ అయింది.
ఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆదివారం నాటి నాలుగో రోజు ఆటలోనే మ్యాచ్ను ముగించేసింది. స్మృతి మంధాన 38, జెమీమా రోడ్రిగ్స్ 12 పరుగులతో ఆఖరి అజేయంగా నిలవగా.. 18.4 ఓవర్లలోనే టార్గెట్ను పూర్తి చేసింది. మంధాన ఫోర్ బాది విజయాన్ని ఖరారు చేయగా.. ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
More Stories
రాజ్యాంగం మారుస్తామని కాంగ్రెస్ అసత్య ప్రచారం
రాయ్బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ
బీజేపీ గెలుపు మన దేశానికి అవసరం