అయోధ్యలో దివ్యమైన రామ మందిరం నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటోంది. ఇక 2024 జనవరి 22 వ తేదీన అయోధ్య రామాలయంలో రామ్ లల్లాకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యే వారికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపుతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కానున్నారు. అయితే రామాలయ ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చేందుకు సిద్ధం అవుతుండగా కేవలం ఆహ్వానాలు ఉన్నవారు మాత్రమే జనవరి 22 వ తేదీన అయోధ్యకు రావాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
జనవరి 22 న జరిగే అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట క్రతువుకు రామ మందిర ట్రస్ట్, ప్రభుత్వ విధుల్లో ఉండేవారు, ఆహ్వాన పత్రికలు ఉన్నవారు మాత్రమే రావాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఆహ్వానాలు లేని వారికి అయోధ్యలోకి ప్రవేశం ఉండదని తేల్చి చెప్పారు.
గురువారం అయోధ్యలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఆహ్వాన పత్రికలు లేకుండా అయోధ్యలో ముందస్తు బుకింగ్ చేసుకున్న భక్తుల బుకింగ్లు రద్దు చేయాలని స్థానికంగా ఉన్న హోటల్ ఓనర్లు, అయోధ్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అయోధ్య రామ మందిర ట్రస్ట్ ఆహ్వానించిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యే భక్తుల వసతి కోసం ట్రస్ట్ ఏర్పాట్లతో పాటు, ధర్మశాల, హోటళ్లు మొదలైన ప్రదేశాల్లో యాత్రికులు బస చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.
అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వాన పత్రికలు ఉన్నవారికి, ప్రభుత్వ విధుల్లో ఉన్నవారికి మాత్రమే అయోధ్య లోపలికి అనుమతి ఉంటుందని తేల్చి చెప్పారు. ఆ రోజున దేశం నలుమూలల నుంచి అయోధ్యకు పలువురు అతిథులు వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నల్టు తెలిపారు.
More Stories
ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్న మంత్రి
రాహుల్ గాంధీ `పాకిస్తాన్ అనుచరుడు’
బ్రిజ్ భూషణ్ సింగ్ కు బిజెపి సీట్ నిరాకరణ!