పాక్ – చైనా పన్నాగమే పూంఛ్‌ జిల్లాలో ఉగ్ర దాడి

గురువారం జమ్ము కశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో జరిగిన ఉగ్ర దాడి పాకిస్థాన్‌-చైనా పన్నాగమని రక్షణ వర్గాలు వెల్లడించాయి. పూంఛ్‌ జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలను తిరిగి పెంపొందించడం ద్వారా భారత సైన్యంపై ఒత్తిడి తేవాలని ఆ రెండు దేశాలు భావిస్తున్నాని, తద్వారా సైన్యాన్ని లఢక్‌ సరిహద్దు నుంచి కశ్మీర్‌కు తిరిగి వెళ్లేలా చేయాలనేది వారి ప్రణాళిక అని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. 
2020లో గల్వాన్‌ సరిహద్దు ఘర్షణ తర్వాత భారత బలగాలను కశ్మీర్‌కు వెనక్కి పంపాలని చైనా ప్రయత్నిస్తున్నది.  ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌ ఉత్తర ప్రాంతంలో భారత్‌ను ఒత్తిడికి గురి చేసేందుకు పశ్చిమ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని రాజేయాలని చైనా, పాకిస్థాన్‌ భావిస్తున్నాయి.  2003 నుంచి పూంఛ్‌-రాజౌరీ జిల్లాల్లో ఉగ్ర దాడులు ఎక్కువయ్యాయని, ఆనాటి నుంచి ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో దాగుడు మూతలు ఆడుతున్నారని రక్షణ రంగ నిపుణుడు కర్నల్‌ మనోజ్‌ కుమార్‌ తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి భారత సైన్యం అదనపు బలగాలను పంపింది. తాజా ఆపరేషన్లలో 20 మంది ఉగ్రవాదులను ఏరివేసింది. 2019లో 370 అధికరణ రద్దు చేయడంతో పాక్‌, చైనా నిరాశ, కోపంతో ఉన్నాయని, అందుకే అవి కశ్మీర్‌లో ముఖ్యంగా సరిహద్దు జిల్లాలైన పూంఛ్‌, రాజౌరీల్లో సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని విశ్రాంత కర్నల్‌ అజయ్‌ కొతియాల్‌ పేర్కొన్నారు.
ఉగ్రవాదుల కోసం జల్లెడ

ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది అమరులుకాగా, మరో ఇద్దరు జవాన్లు గాయపడిన దారుణ ఘటన నేపథ్యంలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు శుక్రవారం జమ్మూకశ్మీరు పూంచ్ జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.  భారతీయ సైన్యానికి చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టెనెంట్ జనరల్ సందీప్ జైన్ శుక్రవారం భద్రతా దళాల వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడిన ఘటనా స్థలాన్ని సందర్శించి, సైనిక, పోలీసు ఉన్నతాధికారులతో సమీపింయారని అధికారులు తెలిపారు.

సురాన్‌కోట్‌లో గురువారం గ్రవాదులతో అత్యంత వీరోచితంగా పోరాడి అమరులైన నలుగురు జవాన్లకు నివాళుర్పిస్తున్నట్లు భారతీయ సైన్యం, వైట్ నైట్ కోర్స్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నాయి.  గురువారం మధ్యాహ్నం పూంచ్ జిల్లాలోని సురాన్‌కోట్ ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన రెండు వాహనాలపై కాల్పులు జరిపిన గవాదుల ఆచూకీ కోసం హెలికాప్టర్ల ద్వారా గాలింపు జరుపుతున్నామని, పోలీసు జాగిలాలను కూడా రంగంలోకి దింపామని ఒక అధికారి తెలిపారు. 

ఆ ప్రాంతాన్ని గురువారం రాత్రి దిగ్బంధించిన భద్రతా దళం శుక్రవారం ఉదయం భారీ స్థాయిలో మార్డన్ సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు అధికారి ఒకరు తెలిపారు. కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం అదనపు బలగాలను కూడా రప్పించినట్లు ఆయన చెప్పారు.  గురువారం సాయంత్రం 3.45 గంటల ప్రాంతంలో ఆర్డన్,సర్చ్ ఆపరేషన్ కోసం రెండు వాహనాలలో వెళుతున్న భద్రతా దళాలపై ఉగ్రవాదులు మెరుపుదాడి జరిపారు. సురాన్‌కోట్ పోలీసు స్టేషన్ పరిధిలోని డేరా కీ గలి, బఫ్లీజ్ మధ్య ఒక మూలమలుపు వద్ద ఈ కాల్పుల దాడి జరిగింది. 

డేరా కీ గలీని భద్రతా దళాలు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నాయని, అక్కడ ట్రాఫిక్ ఆంక్షలను విధించిందని ఆ అధికారి తెలిపారు. సైన్యం, పోలీసుకు చెందిన ఉన్నతాధికారాలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు.  దాడికి పాల్పడిన ముగ్గురు లేదా నలుగురు సాయుధ ఉగ్రవాదులు సైనిక వాహనాలపై మెరుపు దాడి చేసేందుకు మూలమలుపును ఎంచుకుని పక్కన కొండ పైన తిష్ఠవేశారని అధికారి చెప్పారు. 

దాడి తర్వాత అమరులైన ఇద్దరు భద్రతా జవాన్ల శరీరాలను ముక్కలు చేసిన ఉగ్రవాదులు వారి నుంచి ఆయుధాలను ఎత్తుకెళ్లారని అధికారి చెప్పారు. ఉగ్రవాదుల దాడి జరిపిన పద్ధతి, వాడిన ఆయుధాలను తెలుసుకునేందుకు ఆ ప్రదేశం వద్ద దర్యాప్తు జరుగుతున్నట్లు భద్రతాధికారులు తెలిపారు