గాజాలో ప్రతి ఒక్కరూ తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొనవచ్చు. ఇప్పటికే గాజాలో 5,76,000 పాలస్తీనియన్లు (జనాభాలో మూడో వంతు) ”తీవ్రమైన ఆకలి, కరువు” పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఓ నివేదిక పేర్కొంది. ఐక్యరాజ్యసమితికి చెందిన 23 ఏజన్సీలు మరియు ప్రభుత్వేతర సంస్థలు సంయుక్తంగా ఈ నివేదికను విడుదల చేశాయి.
గాజాలోని మొత్తం 2.3 మిలియన్ల జనాభాలో తీవ్ర స్థాయిలో ఆకలి ఎదుర్కొంటోంది మరియు ప్రతిరోజూ కరువు ప్రమాదం పెరుగుతోందని నివేదిక స్పష్టం చేసింది. గాజాకు అందించే మానవతా సాయాన్ని పెంచాలని ఐరాస అధ్యక్షుడు ఆంటోనియో గుటెరస్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
దీంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ఎసి)లో కాల్పుల విరమణ తీర్మానంపై ఓటింగ్ మరోరోజు ఆలస్యమైంది. గాజాలో తీవ్రమైన ఆహార అభద్రతతో ప్రభావితమైన కుటుంబాల నిష్పత్తి ప్రపంచవ్యాప్తంగా నమోదైన వాటిల్లో అతిపెద్దదని ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ (ఐపిసి) విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
గాజాలో ఆకలి తీవ్రత ఇటీవలి సంవత్సరాల్లో ఆఫ్ఘనిస్థాన్, యెమెన్లలో కరువును కూడా అధిగమించిందని నివేదికలోని అంకెలు తెలుపుతున్నాయి. భారీ మొత్తంలో ప్రజలు కరువు బారిన పడటం ఇప్పటి వరకు చూడలేదని, కేవలం రెండు నెలల్లో గాజాలో ఆ పరిస్థితులు ఏర్పడ్డాయని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్స్ చీఫ్ ఎకనామిస్ట్ అరిఫ్ హుస్సేన్ తెలిపారు.
అంటే గాజాలో పరిస్థితి ఆందోళనకరమని, ప్రతిఒక్కరూ ఆకలితో అల్లాడుతున్నారని హుస్సేన్ పేర్కొన్నారు. తగిన పోషకాహారం అందకపోవడంతో వారు వ్యాధుల బారిన పడే ప్రమాదం అధికంగా ఉందని తెలిపారు. వచ్చే ఆరు వారాల్లో గాజాలోని ప్రతి ఒక్కరూ తీవ్ర ఆహార అభద్రతను ఎదుర్కొంటారని నివేదిక పేర్కొంది.
నాలుగు నెలల యుద్ధం అనంతరం ఫిబ్రవరి 7 నాటికి గాజాస్ట్రిప్లోని మొత్తం జనాభా ”ఆకలి సంక్షోభం లేదా అధ్వాన్న” పరిస్థితుల్లో ఉంటుందని అంచనా వేశాయి. ఐపిసి ఐదు దశల ఆహార అభద్రత వర్గీకరణ ప్రకారం మూడవ దశలో సంక్షోభం, నాలుగు ఎమర్జెన్సీ, ఐదు విపత్తు లేదా కరువు పరిస్థితులు ఉన్నట్లు తెలిపింది.
ఐపిసి ఏదైనా నిర్దిష్ట ప్రాంతం లేదా దేశం కోసం వర్గీకరించిన అధిక స్థాయి తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్న వ్యక్తులలో గాజా అత్యధిక వాటా కలిగి ఉందని నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ మావనతా సంస్థ కేర్ (సిఎఆర్ఇ) ఈ గణాంకాలను ఆందోళనకరం అని పేర్కొంది.
ఇలా ఉండగా, పాత గాజాస్ట్రీట్లోని జాబాలియా నగరంలోని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ మునీర్ అల్ బుర్ష్ కుటుంబాన్ని ఇజ్రాయిల్ సైన్యం లక్ష్యం చేసుకుందని పాలస్తీనియన్ షెహాబ్ న్యూస్ ఏజన్సీ తెలిపింది. ఈ దాడిలో అల్ బుర్ష్ తీవ్రంగా గాయపడగా, ఆయన కుమార్తె సహా 16 మంది మరణించినట్లు పేర్కొంది.
మరో 50 మందికి తీవ్రగాయాలయ్యాయని ప్రకటించింది. గాజా నగరంలోని షేక్ రద్వాస్ జిల్లాలో అబు ఇస్కందర్ ప్రాంతంలో ఓ నివాసంపై ఇజ్రాయిల్ బాంబు దాడిలో తొమ్మిది మంది పాలస్తీనియన్లు మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది.
కాగా, హమాస్ ను పూర్తిగా అంతం చేసే లక్ష్యంతో గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల్లో ఇప్పటివరకు 20,057 మంది చనిపోయారని, 53,320 మంది గాయపడ్డారని అక్కడి వైద్యాధికారులు తెలిపారు. వీరిలో 65 శాతంకు పైగా మహిళలు, చిన్నారులే ఉన్నారని వెల్లడించారు. మరోవంక, ఇప్పటివరకు 7 వేల మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
More Stories
స్వాతి మలివాల్పై దాడి గురించి కేజ్రీవాల్ దాటవేత
ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట
‘అధిక సంతానం’ ముస్లింల గురించి కాదు.. పేదల గురించి