ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో తెలుగు రాష్ట్రాల్లో ముగ్గురు

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)  నిషేధిత పాపులర్ ప్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) కార్యకలాపాల దర్యాప్తులో మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే ఎన్ఐఏ పలువురిని అరెస్టు చేయగా, తాజాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులను వాంటెడ్ జాబితాలో చేర్చి విచారణ చేస్తుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్‌లోని మల్లేపల్లికి చెందిన ఎండీ అబ్దుల్ ఆహద్ అలియాస్ ఎంఏ అహద్, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఖాజానగర్‌కు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్లను వాటెండ్ జాబితాలోకి చేర్చింది. 
 
ఈ ముగ్గురు గురించి సమాచారం తెలిసిన వారు 9497715294కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని కోరింది. ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం సైతం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పీఎఫ్ఐ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022 ఏడాది సెప్టెంబరులో నిషేధం విధించిన విషయం తెలిసిందే. 
 
అదే సమయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లోని 100 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్; ఏపీలోని కర్నూలు, నెల్లూరుల్లో దాడులు చేసి పలువురిని అరెస్టు చేశారు. అంతకు ముందే నిజామాబాద్ పోలీసులు పీఎఫ్ఐ కార్యకలాపాలపై కేసులు నమోదు చేయడం కలకలం రేపింది.
ఆ కేసు ఆధారంగానే ఎన్ఐఏ రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా దాడులు చేసింది. ఇక, తాజాగా పీఎఫ్ఐ కేసులోనే తెలుగు రాష్ట్రాల్లోని ముగ్గురితో పాటు కేరళలో 11 మందిని, కర్ణాటకలో అయిదుగురిని, తమిళనాడులో ఐదుగురిని మోస్ట్ వాంటెండ్ జాబితాలో చేర్చింది. కాగా, పీఎప్ఐ కేసులో ఇప్పటివరకు 17 మంది నిందితులను ఎన్ఐఏ అరెస్టు చేసింది.
వీరిపై 2022లో నిజామాబాద్ ఆరో టౌన్ పీఎస్‌లో నమోదైన కేసు ఆధారంగా కేసు నమోదు చేసి ఎన్ఐఏ దర్యాప్తును చేస్తోంది. 2047 లోపు భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలనే లక్ష్యంతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ నిందితులు పని చేస్తున్నారని ఎన్ఐఏ పేర్కొంది. 
 
ముస్లిం యువతకు దేహదారుఢ్య శిక్షణ పేరుతో మారణాయుధాలతో దాడి చేయడంపై నిందితులకు పీఎఫ్ఐ సంస్థ శిక్షణ ఇచ్చినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగుతుంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పీఎఫ్ఐ‌పై కేంంద్ర నిసేధం విధించిన విషయం తెలిసిందే.