ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉండేది అమెరికా అధ్యక్షుడే. అలాంటిది జో బైడెన్ భద్రతలో తాజాగా వైఫల్యం చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్లోని ఓ వాహనాన్ని మరో కారు ఢీకొంది. ఈ ఘటనతో ఒక్కసారిగా అగ్రరాజ్యం ఉలిక్కిపడింది.
ఈ సంఘటన జరిగిన సమయంలో జో బైడెన్తోపాటు ఆయన సతీమణి జిల్ బైడెన్ కూడా అక్కడే ఉన్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు వెంటనే బైడెన్ దంపతులను అధ్యక్షుడి వాహనంలోకి తరలించారు. అనంతరం ఈ దాడికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి డెలావర్లో ఈ భద్రతా వైఫల్యం ఘటన చోటు చేసుకుంది. అమెరికా వైట్ హౌస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ ఆదివారం రాత్రి డెలావర్లోని రిపబ్లికన్ పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు. అక్కడే డిన్నర్ ముగించుకున్న బైడెన్ దంపతులు అనంతరం ఆఫీస్ బయట ఉన్న తమ కాన్వాయ్ వద్దకు చేరుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే ఓ కారు వేగంగా దూసుకొచ్చి అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్లో ఉన్న యూఎస్ సీక్రెట్ సర్వీస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. అనంతరం మరో వాహనంపైకి దూసుకెళ్లేందుకు ఆ కారు ప్రయత్నించింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న బైడెన్ దంపతులు, ఇతర సెక్యూరిటీ సిబ్బంది అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఆ సమయంలో జిల్ బైడెన్ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండగా జో బైడెన్ మాత్రం ఆ వాహనానికి పక్కనే నిలబడి ఉన్నారు. జో బైడెన్ నిలబడిన ప్రాంతానికి కేవలం 130 అడుగుల దూరంలోనే ఈ యాక్సిడెంట్ జరిగింది. అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్లో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం ఘటన నేపథ్యంలో బైడెన్ దంపతులను వెంటనే వైట్హౌస్కు తరలించినట్లు వైట్హౌస్ అధికారులు వెల్లడించారు. జో బైడెన్, జిల్ బైడెన్ ఇద్దరూ సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.
More Stories
ఉక్రెయిన్ పై రష్యా రసాయన ఆయుధాల ప్రయోగం!
విదేశీ విద్యార్థులకు కెనడా వారానికి 24 గంటలే వర్క్ పర్మిట్
ఆఫ్ఘన్ షియా మసీదులో కాల్పులు.. ఆరుగురు మృతి