అమెరికాలో 18,000 మంది భారతీయులకు బహిష్కరణ గండం

అమెరికాలో 18,000 మంది భారతీయులకు బహిష్కరణ గండం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతుండడంతో సరైన పత్రాలు లేని దాదాపు 18,000 మంది భారతీయులు బహిష్కరణను ఎదుర్కొంటున్న వారిలో ఉన్నట్టు సమాచారం. ట్రంప్‌ యంత్రాంగం బహిష్కరణల కోసం సైనిక విమానాలను ఉపయోగించడానికి సిద్ధమవుతున్నది. 

బహిష్కరణను ఎదుర్కొంటున్న భారతీయ అక్రమ వలసదారులకు చట్టపరమైన పరిష్కారాలు దొరికే అవకాశం చాలా పరిమితంగా ఉండవచ్చని, చాలామందికి అప్పీళ్లు, అభ్యర్థనలు లేదా న్యాయపరమైన ప్రాతినిధ్యం పొందే అవకాశం ఉండకపోవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. మరోవైపు ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) బృందాలు దేశవ్యాప్తంగా దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. 

అమెరికాలోని నాలుగు నగరాలైన న్యూయార్క్‌, టెక్సాస్‌, కాలిఫోర్నియా, న్యూజెర్సీల్లో ఈ బహిష్కరణ ప్రచారం అక్రమ వలసదారుల జీవితాలను పూర్తిగా మార్చేసింది. డిటెన్షన్‌ సెంటర్లలో నిర్బంధించిన ప్రజలపై జరిగిన దుర్మార్గానికి సంబంధించిన కథనాలు కూడా వెలుగులోకి వచ్చాయి.  2025లో అమెరికా 3,567 మంది భారతీయ పౌరులను బహిష్కరించిందని భారతదేశ విదేశాంగ మంత్రిత్వశాఖ 2026 జూన్‌లో తెలిపింది. 

2026 జూన్‌ నాటికి 1,076 మంది భారతీయులను బహిష్కరించినట్టు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. 5 ఫిబ్రవరి 2025న అమెరికా మొదటిసారిగా 104 మంది భారతీయులను సైనిక విమానంలో అమృత్‌సర్‌కు పంపింది. బహిష్కరణకు గురవుతున్న వలసదారులను ఉంచడానికి ట్రంప్‌ యంత్రాంగం ఎల్‌పాసో, కాలిఫోర్నియాలో రెండు భారీ గిడ్డంగులను కొనుగోలు చేసింది. 

వీటికోసం సుమారు రూ. 16,500 కోట్లు ఖర్చు చేశారు. వీటిని డిటెన్షన్‌ సెంటర్లుగా మార్చి ఐసీఈకి అప్పగించారు. దాదాపు 12 వేలమంది వలసదారులను ఇక్కడ ఉంచారు. గతంలో విచారణలు ఉండేవని, ఇప్పుడు నేరుగా డిటెన్షన్‌ సెంటర్లకు పంపుతున్నారని లాయర్లు చెప్తున్నారు.