ఐదు రాష్ట్రాల్లో వికసిత్ భారత్ యాత్ర ప్రారంభించిన మోదీ 

ఐదు రాష్ట్రాల్లో వికసిత్ భారత్ యాత్ర ప్రారంభించిన మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రారంభించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలలో ఈ సంకల్ప్ యాత్రను ఏకకాలంలో ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించారు. నిజానికి ఈ రాష్ట్రాలలో ఈ సంకల్ప్ యాత్ర ముందుగానే జరగాల్సి ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలుతో దీనిని వాయిదా వేశారు. 

ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలువురు లబ్ధిదారులతో ముచ్చటించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందుతున్న వారిని ఎంచుకుని వారి స్పందనను తెలుసుకున్నారు. దేశంలో ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ కార్యక్రమం వల్ల దేశంలోని మహిళలు తమను తాము నిలబెట్టుకున్నారని, అంతేకాకుండా ఇతరులకు కూడా తగు విధంగా ఉపాది కల్పిస్తున్నారని చెప్పారు. 

ఆత్మనిర్భర్ పథకం లబ్ధిదారుతో ఆయన ముచ్చటించారు. కష్టపడి పనిచేసేవారికి, అంకితభావపు వ్యక్తులకు తమ ప్రభుత్వం పలు విధాలుగా చేయూత అందిస్తుందని వివరించారు. ఈ దేశాన్ని 2047 నాటికి సంపన్న దేశంగా తీర్చిదిద్దడమే తమ లక్షం అని మోదీ తెలిపారు. ఈ వీడియో అనుసంధాన కార్యక్రమంలో ఐదు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది లబ్ధిదారులు పాల్గొన్నారు.

అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యంగా చేపట్టిన మోదీ గ్యారెంటీ వెహికల్ దేశంలోని ప్రతి ప్రాంతానికి చేరాలని తాము కృతనిశ్చయంతో ఉన్నట్టు ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు. కేవలం నెల రోజుల్లోనే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర వేలాది గ్రామాలు, 1,500 సిటీలకు చేరినట్టు తెలిపారు. అభివృద్ధి చెందిన భారత్ సాధనలో మన నగరాలు కీలక భూమిక పోషిస్తున్నాయని చెప్పారు.

స్వాతంత్ర్యానంతరం చాలాకాలం వరకూ కొన్ని పెద్ద నగరాలు మాత్రమే అభివృద్ధిని చూరగొన్నాయని, ఈరోజు టైర్-2, 3 సిటీలపై కూడా తాము దృష్టి సారించామని చెప్పారు. అమృత్ మిషన్ లేదా స్మార్ట్ సిటీ మిషన్ ద్వారా చిన్న నగరాల్లో సైతం కనీస వసతులను మెరుగపరుస్తున్నామని, నీటి సరఫరా, డ్రైనేజ్, మురుగునీరు సిస్టమ్, ట్రాఫిక్ సిస్టమ్, సీసీటీవీ నెట్‌వర్క్ నిరంతరంగా అప్‌గ్రేడ్ చేస్తున్నామని వివరించారు. 

స్వచ్ఛత, పబ్లిక్ టాయిలెట్లు, ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా సులభతర వాణిజ్యం సాధ్యమై జీవనవిధానం సులభతరమవుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం పేదలు, రైతులు, చిన్న వ్యాపారాలు, సమాజంలోని ఇతర వర్గాలకు అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు.  ఆయా రాష్ట్రాలకు చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు కూడా ఇందులో పాలుపంచుకున్నారు.

దేశవ్యాప్తంగా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక పథకాలను గురించి వివరించడమే ఈ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రధాన ఉద్ధేశం. నిర్ణీత వర్గాలందరికి ప్రభుత్వం తరఫున ప్రయోజనాలు అందుతాయని ఈ దశలో ప్రధాని భరోసా కల్పించారు.  ఇది సమయానుగుణంగా తగు రీతిలో జరిగే ప్రక్రియ అవుతుందని వివరించారు.

ప్రతి ఒక్కరి ఆశలు, ఆకాంక్షలను తీర్చడం ద్వారానే మోదీ గ్యారంటీలు సార్థకం అవుతాయని స్పష్టం చేశారు. ఈ దిశలో తమ ప్రభుత్వం సకల విధాలుగా పాటుపడుతోందని వివరించారు.  కాగా, దేశ సామాన్య ప్రజలందరిని ప్రధాని మోడ్ తమ విఐపిగా భావిస్తుంటారని, ఈ క్రమంలో వారికి తగు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తుంటారని సంకల్ప్ యాత్ర దశలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ప్రధాని ఆలోచనా దృక్పథంతో ఇప్పుడు ప్రతి ఒక్కరి పని అత్యంత వేగవంతంగా జరుగుతుందని చెప్పారు.