చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు

 
* శ్రీ‌లంక రికార్డు బ‌ద్ధ‌లుకొట్టిన భారత్ మహిళలు 
 
సొంత‌గ‌డ్డ‌పై ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఏకైక టెస్టులో టీమిండియా  ఘ‌న విజ‌యం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో అదర‌గొట్టిన భార‌త మహిళల జ‌ట్టు 347 ప‌రుగుల భారీ తేడాతో గెలుపొందింది. దాంతో, టెస్టు ఫార్మాట్‌లో అతి పెద్ద విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది.  త‌ద్వారా ఇప్ప‌టివ‌ర‌కూ శ్రీ‌లంక పేరిట ఉన్న రికార్డు తుడిచి పెట్టుకుపోయింది.  1998లో లంక 309 ప‌రుగుల తేడాతో పాకిస్థాన్‌ను మ‌ట్ట‌కరిపించింది.
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో  మొద‌టి రోజు నుంచి పూర్తి ఆధిప‌త్యం చెలాయించిన హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ సేన మూడో రోజు మ్యాచ్ ముగించ‌డం విశేషం.   సంచ‌ల‌న బౌలింగ్‌తో రాణించిన దీప్తి శ‌ర్మ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికైంది. రెండో ఇన్నింగ్స్‌ను 186 ప‌రుగుల వ‌ద్ద‌ డిక్లేర్ చేసిన భార‌త్.. ఇంగ్లండ్‌ను 131 ర‌న్స్‌కే ప‌రిమితం చేసింది. నవీ ముంబైలో జరిగిన ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు 347 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‍పై విజయం సాధించింది. 
 
మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత భారీ విజయాన్ని టీమిండియా దక్కించుకొని చరిత్ర సృష్టించింది.  రెండో ఇన్నింగ్స్‌లో 479 పరుగుల కొండంత టార్గెట్ ముందుడగా ఇంగ్లండ్ నేడు 131 పరుగులకే కుప్పకూలింది.  భారత స్పిన్నర్ దీప్తి శర్మ నాలుగు, పూజా వస్త్రాకర్ మూడు వికెట్లతో సత్తాచాటగా రాజేశ్వరి గైక్వాడ్ రెండు, రేణుక సింగ్ ఓ వికెట్ తీసుకున్నారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ హీతర్ నైట్ (21), చార్లీన్ డీన్ (21 నాటౌట్) మాత్రమే 20 పరుగుల మార్క్ చేరగలిగారు. మిగిలిన వారు విఫలమయ్యారు. 
 
భారత బౌలర్ల విజృంభణతో ఇంగ్లండ్ టీమ్ గడగడలాడిపోయింది. ఇంగ్లండ్ బ్యాటర్లు కనీస పోటీనివ్వలేక చతికిలపడ్డారు. ఈ మ్యాచ్‍లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది భారత మహిళల జట్టు. తొలి రోజు నుంచే భారత బ్యాటర్లు అదరగొట్టారు.  సతీశ్ శుభ (69), జెమీమా రోడ్రిగ్స్ (68), యక్షిత భాటియా (66), దీప్తి శర్మ (67) తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకాలతో సత్తాచాటారు.
దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 428 రన్స్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్, ఎక్లెస్టోన్ చెరో మూడు వికెట్లు తీశారు. ఇక భారత స్పిన్నర్ దీప్తి శర్మ ఐదు వికెట్లతో విజృభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ విలవిల్లాడింది. 136 పరుగులకే ఇంగ్లిష్ జట్టు చాపచుట్టేసింది. నాట్ స్కీవెర్ బ్రంట్ (59) అర్ధ శతకం చేయగా.. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు.

రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బ్యాటర్లు రాణించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (44 నాటౌట్), షెఫాలీ వర్మ (33) సత్తాచాటారు. మొత్తంగా రెండో ఇన్నింగ్స్‌ను 6 వికెట్లకు 186 పరుగుల వద్ద భారత డిక్లేర్ చేసింది టీమిండియా. ఇంగ్లండ్‍కు 479 పరుగుల భారీ టార్గెట్ సెట్ చేసింది భారత మహిళల జట్టు. దీప్తి శర్మ సహా టీమిండియా బౌలర్లు మరోసారి సత్తాచాటడంతో ఇంగ్లండ్ 131 పరుగులకే మూడో రోజే కుప్పకూలింది. దీంతో భారత్ ఘన విజయం సాధించింది.