రాచ‌రికం పోయింది…ప్ర‌జా పాల‌న వచ్చింది

రాచ‌రికం పోయింది…ప్ర‌జా పాల‌న వచ్చింది

తెలంగాణ‌లో ప్రజాపాలన మొదలైందని గ‌వ‌ర్న‌ర్ డా. త‌మిళి సై సౌందర్  రాజన్ తెలిపారు. రాచరికం నుంచి తెలంగాణ విముక్తి పొందిందని పేర్కొంటూ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము పాలకులం కాదు సేవకులం అన్నారని ఆమె గుర్తు చేశారు.  ఉభయ సభలను ఉద్దేశించి శుక్రవారం ముందుగా గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి కొత్త‌గా ఎన్నికైన స‌భ్యుల‌కు, కొత్త ప‌భుత్వానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌దుపరి ఇంగ్లీష్ లో తన ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పారు. 

కొత్త ప్రభుత్వం ప్రజాసేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు గవర్నర్ తెలిపారు. తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని గవర్నర్‌ ప్రకటించారు.  ప్రజావాణి కార్యక్రమంతో కొత్త ప్రభుత్వం ముందుకెళుతోందని తెలిపారు. 

బలిదానాలు చేసిన వారి త్యాగాలను గుర్తించాలని చెబుతూ పదేళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారని ఆమె పెక్రోన్నారు. తన ప్రభుత్వంలో తెలంగాణ స్వేఛ్ఛా వాయువులు పీల్చుకుంటోందని ఆమె భరోసా ఇచ్చారు. నియంతృత్వ పాలనా పోకడల నుంచి తెలంగాణ విముక్తి పొందిందని తెలిపారు. 

నిర్బంధాన్ని సహించబోమని విస్పష్టమైన ప్రజాతీర్పు వచ్చిందని చెబుతూ ఈ తీర్పు పౌర హక్కులకు, ప్రజాస్వామ్య పాలనకు నాంది అని ఆమె చెప్పారు. పాలకులకు, ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయని గవర్నర్ స్పష్టం చేశారు. అడ్డుగోడలు, అద్దాల మేడలు పటాపంచలైపోయాయని తెలిపారు. ఏడాది లోపు తమ ప్ర‌భుత్వం 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తుంద‌ని, ఆరు నెల‌ల్లో మెగా డీఎస్సీ నిర్వ‌హించి, ఉపాధ్యాయ ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని ఆమె వెల్లడించారు.

ప్రజా ప్రభుత్వ ప్రస్థానం మొదలైందని చెప్పడానికి గర్విస్తున్నానని తెలిపారు. ప్రజాకవి కాళోజీ కవితతో గవర్నర్ తన ప్రసంగాన్ని ఆమె ప్రారంభించారు. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా తమ ప్రభుత్వం సమాన దృష్టితో చూస్తుందని ఆమె హామీ ఇచ్చారు. అణచివేతకు, వివక్షకు గురైన ప్రతి వర్గానికి తమ ప్రభుత్వంలో స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు 250 గ‌జాల ఇంటి స్థ‌లం, గౌర‌వ‌భృతి ఇస్తామని గవర్నర్ ప్రకటించారు.

గ్రామీణ అభివృద్ధిలో గత ప్రభుత్వం ప్రచారానికే పరిమితం అయ్యిందని చెబుతూ  ప్రతి గ్రామ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఇళ్లు నిర్మించుకునే పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని, ఇళ్లు నిర్మించుకునే ఎస్‌సి ఎస్‌టిలకు రూ. 6 లక్షల ఆర్థిక సాయం చేస్తామని గవర్నర్ ప్రకటించారు.

మెగా డిఎస్‌సి ద్వారా ఆరు నెలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని, ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని గవర్నర్ ప్రకటించారు. భూమాత ద్వారా భూ సమస్యలను పరిష్కారం చేస్తామని ఆమె చెప్పారు. విద్యుత్ సంస్థలు 81 వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయిందని, గత ప్రభుత్వాల తప్పిదంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆమె విమర్శించారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో విద్యుత్ వ్యవస్థ ఆగమైందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను డ్రగ్ ఫీ సీటీగా మారుస్తామని గవర్నర్ చెప్పారు.