ఆసుపత్రికి ఎవ్వరూ రావద్దని కోరిన కేసీఆర్

తనను పరామర్శించేందుకు ఎవరూ యశోద ఆసుపత్రికి రావద్దని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మాజీ సిఎం కెసిఆర్ మంగళవారం ఆసుపత్రి బెడ్ నుంచి వీడియో సందేశం విడుదల చేశారు. ఇన్ఫెక్షన్ సోకుతుందని వైద్యులు తనను బయటకు పంపడం లేదని పేర్కొన్నారు.

తనతో పాటు వందలాది మంది రోగులలకు ఇబ్బంది కలగకూడదని తెలిపారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని, త్వరలోనే సాధారణ స్థితికి చేరుకొని మీ ముందుకు వస్తానని బిఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులను ఉద్దేశించి చెప్పారు.  వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రం నుంచి వందలాది, వేలాదిగా తరలివచ్చిన అభిమానులందరికీ కెసిఆర్ హృదయపూర్వక వందనాలు తెలిపారు. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్‌తో తాను యశోద హాస్పిటల్లో చేరానని తెలిపారు. 

ఆసుపత్రికి సందర్శకులు పెరగడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సమస్య ఇంకా పెరిగి చాలా అవస్థలు వస్తాయని, దాంతో నెలల తరబడి బయటకు పోలేరని వైద్యులు చెబుతున్నారని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అందరూ బాధపడకుండా మీ స్వస్థలాలకు మంచిగా, క్షేమంగా వెనుదిరిగి వెళ్లాలని కోరారు. 

ఇంకో పది రోజుల వరకు ఎవరూ కూడా ఆసుపత్రికి తరలిరావొద్దని ఈ సందర్భంగా కెసిఆర్ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. హాస్పిటల్‌లో మనం కాకుండా వందలాది మంది కూడా ఉంటారని, వాళ్ల క్షేమం కూడా మనకు ముఖ్యమని పేర్కొన్నారు. “కాబట్టి ఎవరూ అన్యదగా భావించకుండా, క్రమశిక్షణతో మీ ఇళ్లకు చేరండి… మంచిగ అయిన తర్వాత నేను ప్రజల మధ్యన ఉండేవాన్నే కాబట్టి, మనం కలుసుకుందాం… దానికి ఇబ్బంది లేదు” అని కెసిఆర్ తెలిపారు.

తుంటి ఎముక గాయంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ కు పరామర్శలు కొనసాగుతున్నాయి. మంగళవారం నాడు మేఘాలయ ముఖ్యమంత్రి కోన్రాడ్ సంగ్మా కెటిఆర్‌కు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కెసిఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ మరోసారి కెటిఆర్‌కు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగితెలుసుకున్నారు.