ఉచితంగా ఆధార్ అప్‌డేట్ గడువు పెంపు

ఇప్పుడు దేనికైనా ఆధార్ కార్డు తప్పనిసరి. ఇంతకుముందే ఆధార్ తీసుకున్న వారు పదేండ్ల తర్వాత తమ డెమోగ్రఫిక్ వివరాలు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవడానికి భారత్ విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఈ నెల 14 వరకు గడువు ఇచ్చింది. 
 
కానీ తాజాగా మరోసారి ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవడానికి యూఐడీఏఐ అవకాశం కల్పించింది. దీంతో వచ్చే ఏడాది అంటే 2024 మార్చి 14 వరకూ ఫ్రీగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చు. ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుండటంతో గడువు పొడిగించాలని నిర్ణయించామని ఉడాయ్ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
గడువు దాటిన తర్వాత ఫీజు చెల్లించి ఆధార్ పత్రాలు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.  ఆధార్ కార్డు కోసం పేరు రిజిస్టర్ చేసుకున్న తేదీ నుంచి పదేండ్లు పూర్తయిన తర్వాత తగిన పత్రాలతో ఆధార్ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసుకోవాలని ఇంతకుముందే పౌరులకు ఉడాయ్ సూచించింది. 
 
కనుక ఇక నుంచి ప్రతి ఒక్కరూ పదేండ్లకోసారి గుర్తింపు కార్డు, అడ్రస్ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటరీ (సీఐడీఆర్)లోని వివరాలు అప్‌డేట్ చేసుకోవాలని వెల్లడించింది. ఈ ప్రక్రియతో పౌరుల వ్యక్తిగత సమాచారం ఎప్పటికప్పుడు సీఐడీఆర్‌లో అప్‌డేట్ అవుతూ ఉంటుందని, దీనివల్ల ఖచ్చితమైన సమాచారం నిక్షిప్తమవుతుందని వివరించింది.ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయాల్సిన వారు ఉడాయ్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి లేటెస్ట్ గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలు సబ్మిట్ చేయాలి. రేషన్ కార్డ్, ఓటరు గుర్తింపు కార్డు, కిసాన్ ఫోటో పాస్‌బుక్, పాస్ బుక్ తదితర డాక్యుమెంట్లను గుర్తింపు, చిరునామా లకు ధ్రువీకరణ పత్రాలు వాడవచ్చు. 

విద్యార్థులైతే వారి విద్యా సంస్థ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ), మార్క్ షీట్, పాన్/ ఈ-పాన్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగ పడతాయని పేర్కొంది. అలాగే మూడు నెలల్లోపు చెల్లించిన విద్యుత్, వాటర్, గ్యాస్, టెలిఫోన్ బిల్లుల రశీదులు కూడా అడ్రస్ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించవచ్చునని ఉడాయ్ తెలిపింది. ధ్రువీకరణ పత్రాల స్కాన్డ్ పత్రాలను ‘మై ఆధార్’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.