సుప్రీం తీర్పును స్వాగతించిన విహెచ్‌పి, ఆర్ఎస్ఎస్

* “పాక్ ఆక్రమిత కశ్మీర్ విముక్తి” ఒక్కటే అసంపూర్తి ఎజెండా 

ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించడంపై సుప్రీం కోర్టును విశ్వహిందూ పరిషత్ ప్రశంసించింది. అయితే ఇంకా ‘పాక్ ఆక్రమిత కశ్మీర్ విముక్తి’ ఒక్కటే అసంపూర్తి ఎజెండాగా ఉందని పేర్కొంది. 

పటిష్టమైన భారత్ దృఢ నిర్ణయమే త్వరలో పాక్ నుంచి కశ్మీర్‌ను విముక్తి చేస్తుందని తాము నమ్మకంతో ఉన్నామని విశ్వహిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ గొప్ప త్యాగానికి యావత్ జాతి నివాళి అర్పించడమేనని ఆయన ప్రశంసించారు.

ఆనాటి రాచరిక రాష్ట్రమైన జమ్ము కశ్మీర్ ఆఖరి పాలకుడు మహారాజా హరిసింగ్ తన రాష్ట్రాన్ని భారత్‌లో విలీనం చేయడానికి అంగీకరిస్తూ 1947 48 లో సంతకం చేసిన లేఖను సుప్రీం కోర్టు తన తీర్పులో ఉదహరించిందని చెప్పారు. ఆమేరకు ఇది తుది నిర్ణయమని, తిరుగులేనిదని కుమార్ వివరించారు. కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ ఆనాటి రాజకీయ నాయకత్వం జమ్ముకశ్మీర్‌కు ఆర్టికల్ 370 ద్వారా ప్రత్యేక హోదా ఇవ్వడం కొంత “రాజకీయ అపార్ధాలు” గా వ్యాఖ్యానించారు.

`సుప్రీం’ తీర్పు స్వాగతించిన ఆర్ఎస్ఎస్

ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అభినందనీయం అంటూ ఈ నిర్ణయాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వాగతించింది. ఆర్‌ఎస్‌ఎస్ మొదటి నుంచీ ఆర్టికల్ 370 విధించడాన్ని వ్యతిరేకిస్తూ, తాను ఆమోదించిన అనేక తీర్మానాల ద్వారా అదే విధంగా ముందుకు వచ్చిందని అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. 

పైగా, ఈ సమస్యకు సంబంధించిన అన్ని ఉద్యమాలలో ఆర్ఎస్ఎస్ చురుకుగా పాల్గొంటుందని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి మరింత దోహదపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 కారణంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు కొన్నేళ్లుగా తమకు జరిగిన అన్యాయం నుండి ఎట్టకేలకు విముక్తి పొందారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.