త్వరలో పార్లమెంట్‌కు కొత్త క్రిమినల్ చట్ట సవరణ బిల్లు

బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో క్రిమినల్ చట్ట సవరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర క్యాబినెట్ సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అనుమతి ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాగా, హోం వ్యవహారాలకు చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన రెండు సూచనలను ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన కార్యాలయం తిరస్కరించినట్లు వర్గాలు తెలిపాయి. 

సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పులకు విరుద్ధంగా ఉన్న ఈ సూచనలు సవరణ చట్టంలో పొందుపరచడం వల్ల తీవ్ర పరిణామాలు తలెత్తే అవకాశం ఉందని వారు అభిప్రాయపడినట్లు ఆ వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సూచనలలో ఒకటి అక్రమ సంబంధాలకు చెందిన నేరాలు కాగా, రెండవది స్వలింగ సంపర్కానికి చెందిన నేరాలు ఉన్నట్లు వర్గాలు వివరించాయి.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న భారతీయ న్యాయ సంహిత బిల్లు, 2023లో అక్రమ సంబంధాలకు చెందిన నేరాలను తిరిగి పొందుపరచాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే సుప్రీంకోర్టు 2018లోనే ఈ నేరాన్ని కొట్టివేసింది. ఇది మహిళల పట్ల వివక్షతతో కూడుకుని ఉన్నదని, మహిళల గౌరవ మర్యాదలకు భంగకరంగా ఉందని సుప్రీంకోర్టులో తన తీర్పులో పేర్కొంది. 

భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 377 ప్రకారం సమ్మతిలేని శృంగారం శిక్షార్హం చేయాలని స్టాండింగ్ కమిటీ చేసిన రెండవ సిఫార్సు. అయితే పరస్పర సమ్మతితో మైనారిటీ తీరిన స్వలింగ సంపర్కుల శృంగారం నేరం కాదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. ఈ అంశాన్ని కొత్త చట్టంలో చేర్చాలని వారు కోరుతున్నారు.