రాహుల్ ప్రధాని ఆలోచనలను ఎద్దేవా చేసిన ప్రణబ్ ముఖేర్జీ

ప్రధాన మంత్రి పదవిని చేపట్టాలన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  ఆలోచనలను ఒక సందర్భంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖేర్జీ ఎద్దేవా చేశారని, పలు సందర్భాలలో రాహుల్ వ్యవహరించిన తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారని, కేంద్ర మంత్రివర్గంలో చేరి పరిపాలననుభవం సంపాదించుకోమని ఆయన చేసిన సూచనను రాహుల్ పట్టించుకోలేదని ఆమె కుమార్తె, కాంగ్రెస్ అధికార ప్రతినిధి శర్మిష్ఠ ముఖర్జీ వెల్లడించారు.

తన తండ్రి తనతో పంచుకున్న వ్యక్తిగత మనోభావాలను ఆమె మై ఫాదర్: ఎ ఎ డాటర్ రిమెంబెర్స్ పేరిట రచించారు. త్వరలో విడుదల కానున్న ఈ పుస్తకంలోని అంశాలను ఆమె ఒక ఆంగ్ల ప్రతికకు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించారు. ఒక రోజు ఉదయం ముఘల్ గార్డెన్స్‌లో తన తండ్రి వాకింగ్ చేస్తుండగా రాహుల్ వచ్చారని ఆమె తెలిపారు. 

వాకింగ్ చేస్తున్నపుడు, పూజ చేసేటప్పుడు ఎవరూ తన ఏకాంతానికి భండగం కలిగించడాన్ని తన తండ్రి సహించేవారు కారని, కాని ఆ రోజు ఉదయం వాకింగ్ చేస్తుండగా తన తండ్రిని రాహుల్ కలిశారని ఆమె చెప్పారు.  నిజానికి తన తండ్రిని సాయంత్రం కలవాల్సిన రాహుల్ ఉదయం కలిసినట్లు తన దృష్టికి రాగా ఇదే విషయాన్ని తన తండ్రికి చెప్పానని ఆమె పేర్కొన్నారు. 

దీనిపై తన తండ్రి స్పందిస్తూ రాహుల్ కార్యాలయానికి ఎఎంకు- పిఎంకు(ఉదయం, సాయంత్రం) తేడా తెలియకపోతే ఆయనెలా ప్రధాన మంత్రి కాగలరు అని ఎద్దేవా చేశారని ఆమె గుర్తు చేసుకున్నారు. గాంధీజీ- జవహర్ లాల్ నెహ్రూల కుటుంబాల నుంచి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టినా రాహుల్ కి మాత్రం రాజకీయ చతురత అబ్బలేదని తన డైరీలో వ్రాసుకున్నారని ఆమె చెప్పారు.

“రాహుల్‌ గాంధీ మర్యాదగా ప్రవర్తిస్తారు. అనేక ప్రశ్నలు సంధిస్తారు. కానీ, రాజకీయాల్లో ఆయన అనుభవం సాధించలేదు. 2013 జులైలో రాహుల్‌ ఓ సారి మా ఇంటికి వచ్చారు. పార్టీ పునరుద్ధరణకు సంబంధించి తన ప్రణాళికలను చెప్పారు. ఆయన సవాళ్లను ఎదుర్కోగలరని అనిపించింది. ముందు కేబినెట్‌లో చేరి పాలనాపరమైన అంశాల్లో అనుభవం గడించాలని చెప్పాను. కానీ నా సలహాను రాహుల్ వినిపించుకోలేదు’’ అని ప్రణబ్‌ అప్పటి ఘటనల్ని డైరీలో రాసుకున్నారు.

అవినీతి కేసులో శిక్ష పడిన ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వంటి నాయకులపై అనర్హత వేటు పడకుండా కాపాడేందుకు 2013లో అప్పటి యుపిఎ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ చింపివేయడం పట్ల తన తండ్రి తీవ్రంగా కలత చెందారని ఆమె వెల్లడించారు.  ‘‘రాహుల్ కేబినెట్‌ సభ్యుడు కాదు. కేబినెట్‌ ప్రతులను చించేయడానికి ఆయనెవరు? ప్రధాని మన్మోహన్ సింగ్ విదేశాల్లో ఉన్నారు. రాహుల్ చర్యలు ప్రధానిపై, ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది తెలుసా?” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  

“గాంధీ- నెహ్రూ కుటుంబాలనుంచి వచ్చిన వాడిగా కొన్ని విషయాలు సంగ్రహించినప్పటికీ వారి రాజకీయ చతురతే రాహుల్ కి అబ్బలేదు. రాహుల్ ప్రతులు చించేయడంతో యూపీఏ కూటమి మరింతగా పతనమైంది. 2014 ఎన్నికల్లో ఓటమికి అదీ ఒక కారణమే. ప్రధానిని గౌరవించనివారికి ఎవరైనా ఎందుకు ఓటేస్తారు?’’ అని ప్రణబ్ అన్నట్లు శర్మిష్ఠ తన పుస్తకంలో ప్రస్తావించారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలు రాజకీయ అపరిపక్వతతో కూడుకున్నవిగా తన తండ్రి భావించేవారని, అంతేగాక 2014 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత రాహుల్ పార్లమెంట్‌కు తరచు డుమ్మా కొట్టడం పట్ల తన తండ్రి అసంతృప్తి వ్యక్తం చేసేవారని ఆమె గుర్తు చేసుకున్నారు.  కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తనను ప్రధాన మంత్రి పదవిలో కూర్చోపెడతారని తాను ఆశించడం లేదని ఒక జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వూలో తన తండ్రి చెప్పారని ఆమె తెలిపారు. ప్రధాన మంత్రి పదవికి తన తండ్రితోపాటు మన్మోహన్ సింగ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు ఊహాగానాలు సాగాయని ఆమె చెప్పారు. 

మీరు ప్రధాని అవుతారా? అని తాను తండ్రిని ఎంతో ఆతృతగా ప్రశ్నించగా లేదు అని చెబుతూ మన్మోహన్ సింగ్ ప్రధాని అవుతారని ఆయన చెప్పారని శర్మిష్ఠ తెలిపారు. 2009 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన కాంగ్రెస్‌వర్కింగ్ కమిటీ (సిడబ్లుసి) సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ తాను సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకమని చెప్పిన విషయాన్ని తన తండ్రి చెప్పగా విన్నానని ఆమె తన పుస్తకంలో రాశారు. 

అయితే నీ ఆలోచనలు ఏమిటో స్పష్టంగా చెప్పాలని రాహుల్ గాంధీకి ప్రణబ్ ముఖర్జీ సూచించగా తాను వచ్చి విడిగా మాట్లాడతానని రాహుల్ అప్పుడు చెప్పారు. 2004 నుంచి 2014 వరకు యుపిఎ హయాంలో వారిద్దరూ తరచూ కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువని శర్మిష్ఠ తెలిపారు.