స‌నాత‌న ధర్మాన్ని వ్య‌తిరేకించినందుకే కాంగ్రెస్‌కు ఈ శాపం

 
* కాంగ్రెస్ నాయ‌కుడు ప్ర‌మోద్ కృష్ణ‌మ్
 
స‌నాత‌న ధ‌ర్మాన్ని వ్య‌తిరేకించినందుకు ఉత్త‌రాదిలో కాంగ్రెస్‌కు ఈ గ‌తి ప‌ట్టింద‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ఆచార్య ప్ర‌మోద్ కృష్ణ‌మ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ప్ర‌మోద్ కృష్ణ‌మ్ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, రాజ‌స్తాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలలో కాంగ్రెస్ ఓట‌మి దిశ‌గా సాగుతుండ‌టంతో ఈ వాఖ్యలు చేశారు. 
 
స‌నాత‌న ధ‌ర్మాన్ని వ్య‌తిరేకించినందుకే కాంగ్రెస్ నావ మునిగిపోతోంద‌ని ఆయన హెచ్చరించారు. ఫ‌లితాలు వెలువ‌డుతున్నప్పుడే ఎక్స్ (ట్విట‌ర్) వేదిక‌గా ఆయ‌న స్పందిస్తూ `స‌నాత‌న్ కా శాప్’ అని ట్వీట్ చేశారు.  అనంత‌రం ఆయ‌న ఇదే విష‌య‌మై స్పందిస్తూ కాంగ్రెస్ అంటేనే గాంధీ ర‌ఘుప‌తి రాఘ‌వ రాజారాం అన్న సిద్ధాంతాల‌ను పుణికిపుచ్చుకున్న పార్టీ అని ప్ర‌జ‌లు భావిస్తారని గుర్తు చేసారు. 
 
కానీ ఇప్పుడది సనాత‌న ధ‌ర్మానికి వ్య‌తిరేకంగా పయ‌నిస్తోందని పేర్కొంటూ ఒక‌వేళ కాంగ్రెస్ గ‌న‌క ఈ వామ‌ప‌క్ష నాయ‌కుల‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించ‌కుంటే అది కూడా ఎఐఎమ్ఐఎమ్ లా మారుతుందని ధ్వజమెత్తారు. ఈ దేశం కుల రాజ‌కీయాల‌ను ఎప్ప‌టికీ ప్రోత్స‌హించ‌దని స్పష్టం చేశారు.  “సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం వలన పార్టీ మునిగిపోయింది. మన దేశంలో క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎప్పుడూ పనిచేయవు. ఇది కేవలం సనాతన ధర్మాన్ని వ్యతిరేకించిన కారణంగా కలిగిన శాపం ఫలితం”… అంటూ ఆచార్య ప్రమోద్ తెలిపారు.
 
మూడు రాష్ట్రాల ఎన్నిక‌ల‌లో ఓట‌మికి కార‌ణం స‌నాత‌న ధ‌ర్మాన్ని వ్య‌తిరేకించ‌డ‌మే అని తెలిపారు.  ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. 
 
స‌నాత‌న ధ‌ర్మం డెంగ్యూ, మ‌లేరియా, కరోనా వైరస్‌ లాంటిదని, ఇలాంటి వాటిని కేవలం వ్యతిరేకిస్తేనే సరిపోదని, దాన్ని నిర్మూలించేవరకు వదిలిపెట్టకూడదని ఉదయనిధి స్టాలిన్ చేసిన వాఖ్యలో కలకలం రేపాయి. దీనిపై హిందూ ధార్మిక సంఘాలు, బీజేపీ, వీహెచ్‌పీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. స్టాలిన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ వ్యక్తమైంది. అయితే స్టాలిన్ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.
 
అయితే డీఎంకే, కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షం కావటంతో ఈ అంశమై హస్తం పార్టీ ఏమీ స్పందించలేకపోయింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మాన్ని నాశనం చేస్తుందంటూ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో జరిగిన సభలలో ప్రధాని మోదీ పదేపదే ఆరోపిస్తూ వచ్చారు.
భారతీయ సంస్కృతిపై దాడి చేయడమే ఇండియా కూటమి వ్యూహమని విమర్శించారు. 
 
వేల ఏళ్లుగా దేశాన్ని ఏకం చేసిన విశ్వాసాలు, సంప్రదాయాలపై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి దాడి చేస్తుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే తమ ఓటమికి కారణమైందని కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ అభిప్రాయపడ్డారు.