మణిపూర్‌లో రూ.18.85 కోట్ల భారీ బ్యాంకు చోరీ

గత కొన్ని నెలలుగా రెండు జాతుల మధ్య నెలకొన్న ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ లో భారీ చోరీ జరిగింది. ఉఖ్రుల్‌ జిల్లాలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ లో దుండగులు కోట్ల కొద్దీ నగదును దోచుకెళ్లారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం సాయంత్రం బ్యాంక్‌ మేనేజర్‌, సిబ్బంది రోజు లావాదేవీలు, డిపాజిట్‌ కార్యకలాపాలను ముగించారు.
కస్టమర్లు లోపలికి రాకుండా బ్యాంకు బయట ఉన్న మెయిన్‌ షట్టర్‌ను మూసేసి లోపల పనిచేసుకుంటున్నారు.  ఆ సమయంలో సుమారు 10 మంది గుర్తు తెలియని సాయుధ దుండగులు అకస్మాత్తుగా లోపలికి ప్రవేశించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ దగ్గర విధుల్లో ఉన్న బ్యాంక్‌ మేనేజర్‌, సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. అనంతరం బ్యాంకులో ఉన్న రూ.18.85 కోట్ల నగదును దోచుకుని అక్కడి నుంచి ఉడాయించారు.

ఈ దొంగతనానికి సంబంధించిన దృష్యాలు బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజ్‌లో నిక్షిప్తమయ్యాయి. దుండగులు ఏకే రైఫిల్స్ సహా పలు ఆయుధాలతో లోపలికి ప్రవేశించినట్లు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దుండగుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, మే 3న జాతి ఘర్షణలు చెలరేగిన తర్వాత మణిపూర్‌ రాష్ట్రంలో ఇది మూడో భారీ బ్యాంకు దోపిడీ ఘటన కావడం గమనార్హం.