మరిన్ని యుద్ధ విమానాలకై భారీ డీల్‌

మరిన్ని యుద్ధ విమానాలను భారత్‌ సమకూర్చుకోనున్నది. దీనికి సంబంధించిన భారీ డీల్‌కు డిఫెన్స్ ప్యానెల్‌ ఓకే చెప్పింది. భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) కోసం 97 తేజస్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం ఆమోదం తెలిపింది. అలాగే మరిన్ని యుద్ధ విమానాలు పొందేందుకు లైన్‌ క్లియర్‌ చేసింది.
156 ప్రచండ్‌ యుద్ధ హెలికాప్టర్ల కొనుగోలుకు కూడా అనుమతించింది. వీటిలో 90 హెలికాప్టర్లు ఆర్మీకి, 66 హెలికాప్టర్లు ఐఏఎఫ్‌కు కేటాయించనున్నారు.
కాగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌)కు చెందిన ఎస్‌యూ-30 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌కు కూడా డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దేశీయంగా తయారు చేస్తున్న తేజస్ విమానాలు, ప్రచండ్‌ హెలికాప్టర్ల డీల్‌ విలువ రూ.1.1 లక్షల కోట్లు అని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. 
 
తేజస్ మార్క్-1ఏ ఫైటర్‌ జెట్‌ 65 శాతానికి పైగా స్వదేశీ భాగాలతో దేశీయంగా రూపొందించి అభివృద్ధి చేసిన యుద్ధ విమానమని పేర్కొన్నాయి.  ఈ డీల్‌ కార్యరూపం దాలిస్తే దేశ చరిత్రలోనే అతిపెద్ద దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీ ఆర్డర్‌ అవుతుంది.  అంతిమంగా ధరను ఖరారు చేశాక, భద్ర త వ్యవహారాల కేబినెట్‌ కమిటీ క్లియరెన్స్‌ ఇవ్వనుంది. మిలటరీలోకి తేజస్‌ యుద్ధ విమానాలు, ప్రచండ హెలికాప్టర్లను ప్రవేశపెట్టడానికి పదేళ్ల సమయం పడుతుంది. ఇందులో బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) కీలకపాత్ర పోషించనుంది.
 
ఇదిలా ఉండగా యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్‌లో ఉపయోగించే అత్యాధునికి యుద్ధ నౌకలు భారత్‌కు చేతికి వచ్చాయి.  కొచ్చి షిప్‌యార్డ్‌లో నిర్మిస్తున్న మొత్తం ఎనిమిది నౌకల్లో భాగంగా తయారైన మూడు నౌకలను గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా వైస్ అడ్మిరల్ సంజయ సింగ్ మాట్లాడుతూఏ భారత్‌కు అద్భుతమైన నౌకానిర్మాణ వ్యవస్థ ఉందని పేర్కొన్నారు.