జమ్మూ కశ్మీర్లోని రాజౌరీ అటవీ ప్రాంతం ఉగ్రవాదులకు పెట్టనికోట అయింది. పాకిస్థాన్కు చెందిన మాజీ సైనికులు ఇప్పుడు జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద బృందాలలో కీలక నిర్వహకుల పాత్రలలో ఉన్నారని గుర్తించినట్లు నార్తర్న్ కమాండింగ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేద వెల్లడించారు. రాజౌరి ఎన్కౌంటర్ అమరవీరులకు జమ్మూలో ఆయన నివాళులు అర్పిస్తూ ఐదుగురు వీర జవాన్లను ఎన్కౌంటర్లో కోల్పోయామని, అయితే, ఇద్దరు కిరాతక ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు.
రాజౌరీ జిల్లాలో జరిగిన సుదీర్ఘ విస్తృత స్థాయి ఎన్కౌంటర్లో ఇద్దరు భారతీయ సైనికాధికారులు, ముగ్గురు జవాన్లు మృతి చెందారు. పిర్ పంజాల్ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో లష్కరేకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలిందని ద్వివేది తెలిపారు. అక్కడ లష్కరే తోయిబా అగ్రస్థాయి దళనేత ఖ్వారీ, మరో ఉగ్రవాది హతులు అయ్యారు.
ఈ ప్రాంతంలో ఉగ్రవాద చర్యలకు దీనితో ఆటకట్టు అవుతుందని వెల్లడించారు. ధంగ్రీ, కంది, రాజౌరీ ప్రాంతాల్లో ఉగ్రవాదులు అమాయక పౌరులను ఉగ్రవాదులు చంపారని చెప్పారు. స్థానిక ప్రజల నుండి మద్దతు తగ్గిపోవడంతో ఇక్కడ కొత్తగా ఉగ్రవాదులను చేర్చుకోవడం కష్టం కావడంతో పాకిస్తాన్ దేశం వెలుపలి నుండి ఉగ్రవాదులను పంపుతున్నదని ఆయన వెల్లడించారు.
విదేశీ ఉగ్రవాదుల ఆటకట్టించేందుకు మన సైనికులు పట్టుదలతో పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు పాక్, ఆఫ్ఘనిస్థాన్ సహా పలు దేశాల్లో శిక్షణ పొంది నార్తర్న్ కమాండ్ చీఫ్ తెలిపారు. ఉగ్రవాదులు మంచి శిక్షణ పొందారని, వారిని నిర్మూలించేందుకు సైన్యానికి కొంత సమయం పట్టిందని, అయితే మన సైనికులు ధైర్యంగా పోరాడారని కొనియాడారు.
లాన్స్ నాయక్ సంజయ్ బిష్త్ ఏడురోజుల్లో ఉగ్రవాదులను మట్టుబెడుతామని హామీ ఇచ్చారని, అయితే, బెంగళూరులోని తండ్రి ఎంవీ ప్రాంజల్ ఉగ్రవాదుల మృతి వార్త వినేందుకు నిరీక్షిస్తున్న సమయంలోనే కొడుకు బలిదానం వార్తను అందుకున్నారని విచారం వ్యక్తం చేశారు. రాజౌరి, పూంచ్ హైవేల ద్వారా దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించబడి ఉన్నందున అక్కడ మరింత మంది ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉందని చెప్పారు. గత ఏడాది ఈ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రవాద ఘటనల్లో 10 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని నార్తర్న్ కమాండ్ చీఫ్ వివరించారు.
రాజౌరీ ఎన్కౌంటర్తో ఉగ్రవాదం జాడలు, ప్రత్యేకించి జమ్మూ కశ్మీర్లో కొన్ని అనువైన ప్రాంతాలను ఎంచుకుని సాగుతున్న వారి కార్యకలాపాలు ప్రమాదకరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్డ్ సైనికులు పాకిస్థాన్ నుంచి వచ్చి జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద దళాలలో పనిచేస్తున్నారు. యుద్ధాలలో వారి అనుభవాలను ఈ దళాలకు అందిస్తున్నారని, ఇటీవలి ఎన్కౌంటర్ దశలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు.
అదును చూసుకుని ఉగ్రవాదులు చొరబాట్లకు దిగుతున్నారు. ఇందుకు పాకిస్థాన్ సైనిక దళాల నుంచి కూడా తగు విధమైన సాయం అందుతోందని చెప్పారు. రాజౌరీ , పూంచ్ జిల్లాల్లో దాదాపుగా పాతిక మంది వరకూ ఉగ్రవాదులు చురుగ్గా కదులుతున్నారు. ఆయా ప్రాంతాలలోని భౌగోళిక స్వరూపాన్ని ఆసరాగా చేసుకుని వీరు ఎక్కువగా కొండలు, అడవులలో ఉంటూ ఎప్పటికప్పుడు తమ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నారని తెలిపారు.
More Stories
బెంగళూరులో సగం మంది ఓటర్లు ఇంటికే పరిమితం
కేజ్రీవాల్ జైలులో సీఎంగా కొనసాగడంపై హైకోర్టు అసహనం
రెండో దశలో 64.2 శాతం పోలింగ్