ఎట్టకేలకు త్రిషకు మన్సూర్ అలీఖాన్ క్షమాపణలు

తమిళ సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ ఎట్టకేలకు దిగివచ్చారు. హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదానికి కారణమైన మన్సూర్ అలీఖాన్.. సినిమా పరిశ్రమ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అటు తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు త్రిషకు మద్దతుగా నిలబడ్డారు. 
మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పని పలువురు ఖండించడంతో పాటు నడిగర్ సంఘం (దక్షిణ భారత నటీనటుల సంఘం) అయితే త్రిషకు క్షమాపణలు చెప్పకపోతే సభ్యత్వం రద్దు చేస్తామని మన్సూర్‌ను హెచ్చరించింది.  అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. త్రిషకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు.
కానీ, ఆయనపై చట్టపరమైన చర్యలు చుట్టుముడుతున్న వేళ మన్సూర్ దిగొచ్చారు. త్రిషకు క్షమాపణలు చెబుతూ ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘నా సహ నటి త్రిష, దయచేసి నన్ను క్షమించండి!’ అంటూ మన్సూర్ అలీఖాన్ తమిళంలో పేర్కొన్నారు. త్రిష మీద ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల మన్సూర్ అలీఖాన్‌పై పలు చోట్ల పోలీసు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో విచారణ కోసం మన్సూర్ పోలీసుల ఎదుట కూడా హాజరయ్యారు. 
 
మరోవైపు, జాతీయ మహిళా కమిషన్ కూడా మన్సూర్ అలీఖాన్‌పై పోలీసు కేసు నమోదు చేసింది. ఈ కేసులన్నీ చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మన్సూర్ అలీఖాన్ తట్టుకోలేక దిగొచ్చారు. దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లియో’ సినిమాలో మన్సూర్ అలీఖాన్ నటించారు.
అయితే, లోకేష్ కనగరాజ్ తనకు కథ చెప్తున్నప్పుడు త్రిషతో తనకు కొన్ని సన్నివేశాలు ఉంటాయని ఊహించానని.. తాను తన పాత సినిమాల్లో ఖుష్బూ, రోజా లాంటి హీరోయిన్లను రేప్ చేసినట్టు త్రిషను కూడా రేప్ చేసే సీన్ ఉంటుందని అనుకున్నానని మీడియాతో మాట్లాడుతూ మన్సూర్ అలీఖాన్ చెప్పడం తీవ్ర వివాదంకు దారితీసింది.

ఈ వాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన త్రిష ఇలాంటివాళ్లవల్లే మానవజాతికి కళంకం వస్తోందని పోస్ట్ పెట్టారు. ఇంకెప్పుడూ మన్సూర్‌తో కలిసి నటించబోనని ప్రకటించారు. త్రిషకు చాలా మంది సినీ ప్రముఖుల నుంచి మద్దతు లభించింది. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి అక్కినేని నాగచైతన్య, అడివి శేష్, లోకేష్ కనగరాజ్, మాళవిక మోహనన్, ఖుష్బూ, రోజా.. ఇలా చాలా మంది మన్సూర్‌‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

మన్సూర్‌పై చర్యలు తీసుకోవాలని తమిళనాడు పోలీసులను జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. ఐపీసీ సెక్షన్లు 354, 509 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.