నేడు ఉత్తరప్రదేశ్‌లో ‘నో నాన్ వెజ్ డే’

ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 25న(శనివారం) ‘నో నాన్ వెజ్ డే’ (మాంసాహారం లేని రోజు)గా ప్రభుత్వం ప్రకటించింది. సాధు టీఎల్ వాస్వానీ జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని ఆచరించాలని పేర్కొంది. ఈ మేరకు నవంబర్ 25న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మాంసం దుకాణాలతోపాటు కబేళాలను మూసివేయాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. హలాల్ సర్టిఫికేషన్‌ కలిగియున్నఆహార పదార్థాల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, అమ్మకాలపై ఇటీవల యూపీ ప్రభుత్వం నిషేధం విధించింది. 

తాజాగా సాధు వాస్వానీ జయంతి నవంబర్ 25న అంతర్జాతీయ మాంసరహిత దినోత్సవంగా గుర్తించారు. సాధు తన్వర్‌దాస్ లీలారామ్ వాస్వానీ భారతీయ విద్యావేత్తగా విశిష్ట గుర్తింపు పొందారు. విద్యారంగంలో ‘మీరా ఉద్యమాన్ని’ ప్రారంభించింది ఆయనే. సెయింట్ మీరా స్కూల్‌ని స్థాపించారు. ప్రస్తుతం ఈ స్కూల్ పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఉన్న హైదరాబాద్‌లో ఉంది.

నవంబర్ 25, 1878న ప్రస్తుతం పాకిస్థాన్ లోని సింధ్ హైదరాబాద్ లో సింధీ కుటుంభంలో జన్మించిన ఆయన దేశంలో మహిళా విముక్తికి వానిగా పేరొందారు.  శాఖాహార జీవనవిధానంను ప్రబోధించారు. 86 ఏళ్ళ వయస్సులో 1966 జనవరి 16న మృతి చెందారు. ఆయన జన్మించిన నవంబర్ 25ను `అంతర్జాతీయ మాంసాహారంలేని రోజు’గా కూడా గుర్తిస్తారు.