చైనాలో కొత్తరకం న్యూమోనియా వ్యాప్తితో భారత్ అప్రమత్తం

చైనా ఉత్తర ప్రాంతంలో పిల్లల్లో కొత్తరకం న్యూమోనియా వ్యాప్తి చెందుతుందనే వార్త యావత్ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇది, మరో కరోనా మహమ్మారిగా మారుతుందేమోనని భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో పొరుగున ఉన్న భారత్ కూడా అప్రమత్తమైంది. 

హెచ్9ఎన్2 (ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్) కేసులు, శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తి నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అక్కడ వ్యాప్తిచెందుతున్న ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా కేసుల నుంచి భారతదేశానికి ముప్పు తక్కువగా ఉందని పేర్కొంది. ‘ప్రస్తుత పరిస్థితుల నుంచి ఉద్భవించే ఎలాంటి అత్యవసర పరిస్థితికైనా భారతదేశం సిద్ధంగా ఉంది’ అని ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

‘పిల్లలలో శ్వాసకోశ అనారోగ్యానికి సాధారణ కారణాలేనని, అసాధారణమైన వ్యాధికారక లేదా ఏదైనా ఊహించని క్లినికల్ కారణాలు గుర్తించలేదు’ అని తెలిపింది. ఇప్పటి వరకూ డబ్ల్యూహెచ్ఓ ప్రమాద నివేదిక అంచనా ప్రకారం హెచ్9ఎన్2  మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందే ముప్పు, మరణాల రేటు తక్కువ సూచిస్తుందని పేర్కొన్నది. 
 
మానవ, పశుసంవర్ధక, వన్యప్రాణుల విభాగాల మధ్య పర్యవేక్షణను బలోపేతం చేయడం, సమన్వయాన్ని మెరుగుపరచడం అవసరం అని గుర్తించింది. భారతదేశం ఎలాంటి ప్రజారోగ్య అవసరానికైనా సిద్ధంగా ఉందని  ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.  ఆరోగ్య సమస్యల పరిష్కారానికి సమగ్రమైన రోడ్‌మ్యాప్‌ను అనుసరించే వన్ హెల్త్ విధానాన్ని భారత్ ప్రారంభిస్తోందని ప్రకటనలో పేర్కొంది.
 
 ‘ప్రత్యేకించి కోవిడ్ మహమ్మారి నుంచి ఆరోగ్య మౌలిక సదుపాయాలలో గణనీయమైన మార్పు వచ్చింది.. ప్రధాన మంత్రి-ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం-అభిమ్)  ప్రాథమిక, ద్వితీయ, తృతీయ అన్ని స్థాయిలలో నిరంతరాయంగా ప్రస్తుత, భవిష్యత్ మహమ్మారి లేదా విపత్తులకు సమర్థవంతంగా ప్రతిస్పందించడానికి ఆరోగ్య వ్యవస్థలు, సంస్థల సామర్థ్యాలను అభివృద్ధి చేస్తోంది’ అని తెలిపింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థకు  హెచ్9ఎన్2   కేసును చైనా నివేదించిన తర్వాత దేశంలో ఈ వైరస్‌ను ఎదుర్కొనే సంసిద్ధత గురించి చర్చించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.