కేసీఆర్ రెచ్చగొట్టే వాఖ్యలపై ఎన్నికల కమిషన్ సీరియస్

ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సీఎం కేసీఆర్‌కు లేఖ రాసింది. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్ది కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో జరిగిన దాడి ఘటనపై స్పందిస్తూ ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం పై కేంద్రం ఎన్నికల సంఘం సీరియస్ అయింది. 
 
వైషమ్యాలు పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి ప్రసంగం ఉందని, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘననే అని స్పష్టం చేసింది. ఇకపై అలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని హితవు పలికింది.  దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి ఘటనపై స్పందిస్తూ కేసీఆర్ ప్రజాశీర్వాద సభలో రెచ్చగొట్టేలా మాట్లాడారని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ఫిర్యాదు చేశారు. 
 
దీనిపై ఈసీ విచారణకు ఆదేశించగా స్థానిక రిటర్నింగ్ అధికారి ఈ నెల 14న ఈసీకి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిన ఈసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది.  అలాగే కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు నియమావళికి విరుద్ధమని స్పష్టం చేసింది. స్టార్ కాం పెయినర్‌గా, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని తేల్చి చెప్పింది. 
 
ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఇలాంటి ప్రసంగాలు చేసిన వ్యక్తుల పార్టీ అనుమతులు రద్దు చేసే అధికారం తమకు ఉందని గుర్తు చేసింది. ప్రస్తుత వ్యాఖ్యలను మాత్రం సీరియస్‌గా తీసుకోవట్లేదని పేర్కొంది. దీంతో, ఇక పై రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దంటూ కేసీఆర్ ఈసీ ఎడ్వైజరీ జారీ చేసింది. 
 
ఇలా ఉండగా, ఈ నెల 28తో తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీల అగ్ర నేతలు ఈ మూడు రోజులు సుడిగాలి ప్రచారానికి సిద్దమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీఆర్ తదితరులు సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు.
 
హోరా హోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో గెలుపు ఎవరిదనే అంచనాలు పెరుగుతున్నాయి. చివరి నిమిషంలో ఓటర్లను తమకు అనుకూలంగా మలచుకొనేందుకు పార్టీలు చివరి ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ నెల 30న ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.