అత్యధిక సంఖ్యలో బ్రిటన్ వీసాలు భారతీయులకే

బ్రిటన్ వీసాలు ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగా భారతీయులకు, ప్రత్యేకించి నైపుణ్య, వృత్తి విద్యావంతులు, విద్యాభ్యాసానికి వచ్చే వారికి జారీ అయినట్లు వెల్లడైంది. 2023 సెప్టెంబర్ చివరి నాటి వరకూ జారీ అయిన వీసాల లెక్కల గణాంకాలను బ్రిటన్ హోంశాఖ అనుబంధపు జాతీయ గణాంకాల కార్యాలయం (ఒఎన్‌ఎస్) అధికారికంగా తెలిపింది.

భారతీయులకు ఆరోగ్య, చికిత్సల సేవల విభాగంలోనూ అత్యధికంగా వీసాలు దక్కాయని గణాంకాలతో స్పష్టం అయింది. ఇటీవలి కాలంలో భారతదేశం నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు బ్రిటన్ దారి పడుతున్నారు. 

స్టూడెంట్స్ వీసా కేటగిరిలో వీసాలు పొంది బ్రిటన్‌కు వచ్చిన భారతీయు విద్యార్థులు ఎక్కువగా ఇక్కడనే ఉండి తరువాతి దశలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. పిజి కేటగిరిలో భారతీయులకు 43 శాతం మేర వీసాల జారీ జరిగింది. ఇక నైపుణ్య వర్కర్ల వీసాల విషయంలో గడిచిన ఏడాదిలో భారతీయుల కోటాలో 9 శాతం పెరుగుదల కన్పించింది. 

కానీ హెల్త్ కేర్ వీసాల విషయంలో సంబంధిత నైపుణ్య ఉద్యోగులకు వీసాల జారీ ఏకంగా ఇప్పుడున్న దానితో పోలిస్తే 135 శాతం పెరిగింది. ఈ విధంగా ఈ కేటగిరిలో ఈ ఏడాది దక్కిన వీసాల సంఖ్య 1,43,990గా ఉంది. వీటిలో భారతీయులకు 38,866, నైజిరియన్లకు 26715, జింబాబ్వేనియన్లను 21,130 వరకూ వీసాల అవకాశం కల్పించారు. 

ఇంతకు ముందటి ఏడాదితో పోలిస్తే ఇటువంటి వీసాల సంఖ్య భారీగా పెరిగిందని హోం శాఖ తెలిపింది. ఇక విద్యార్థి వీసాల విషయానికి వస్తే భారతీయ విద్యార్థులకు జారీ అయిన వీసాల సంఖ్య 1,33,237 వరకూ ఉంది.   ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులకు ఎక్కువగా సందర్శక వీసాలు దక్కినట్లు వెల్లడైంది. మొత్తం టూరిస్టు వీసాల విషయానికి వస్తే భారతీయులకు ఎక్కువగా అంటే 27 శాతం వరకూ జారీ చేశారు. తరువాతి స్థానంలో చైనాకు 19 శాతం, టర్కీజాతీయులకు 6 శాతం వీసాలు లభించాయి.