తెలంగాణలో కేసీఆర్ తన అవినీతితో రాజకీయాలను భ్రష్టు పట్టించారని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ పార్టీ కల్వకుంట్ల రాష్ట్రీయ సమితిగా మారిందని పేర్కొంటూ ఓ పార్టీ ఒక వ్యక్తి చుట్టూ లేదా ఒక కుటుంబం చుట్టూ తిరిగితే అది రాష్ట్రానికి మంచిది కాదని హెచ్చరించారు.
శ్రీలంకలోనూ కుటుంబ పాలన కారణంగా దేశం నాశనమైందని అన్నామలై గుర్తు చేశారు. విభజన తర్వాత కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ అమలు చేయలేదని పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో కేసీఆర్ పార్టీ.. కల్వకుంట్ల రాష్ట్రీయ సమితిగా మారింది. పార్టీ ఒక వ్యక్తి , ఒక కుటుంబం చుట్టూ తిరుగుతుంది ఇది రాష్ట్రానికి మంచిది కాదు. శ్రీలంకలో కూడా ఇలాగే కుటుంబ పాలనతోనే దేశం నాశనం అయ్యింది” అని గుర్తు చేశారు.
తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కేసీఆర్ ఆరున్నర లక్షల కోట్లు అప్పులు చేశారని అన్నామలై ఆరోపించారు. ఎనిమిది కోట్ల జనాభా కలిగిన తమిళనాడు రూ.7 లక్షల కోట్ల అప్పు ఉంటే, 4 కోట్ల జనాభా కలిగిన తెలంగాణ రూ.6.5 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయిందని ఆయన ధ్వజమెత్తారు. దేశమంతా ఇప్పుడు నరేంద్ర మోదీ మోడల్ కోరుకుంటున్నారని పేర్కొంటూ కేసీఆర్ ప్రభుత్వ పాలన అవినీతికి మోడల్గా మారిందని అన్నామలై విమర్శించారు.
బీజేపీ అన్నివర్గాల ప్రజలను ఆదుకుంటోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బీ టీమ్ అయితే బీఆర్ఎస్కు మజ్లిస్ బీ టీమ్ అని అన్నామలై ఆరోపించారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన రైతు బీమా పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు? అని ప్రశ్నించారు.
మంగళవారం ఆయన తెలంగాణలోని శేరిలింగంపల్లిలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ శేరిలింగంపల్లి నియోజకవర్గం మినీ ఇండియా గా ఉందని, ఇక్కడ అన్ని వర్గాలకు న్యాయం చేస్తాడనే ఉదేశ్యంతో పార్టీ అధిష్ఠానం రవికుమార్ యాదవ్కు టిక్కెట్ ఇచ్చిందని తెలిపారు. ఆయనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
More Stories
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి మాధవీలతపై కేసు నమోదు
డా. సునీత నర్రెడ్డికి అరుదైన గుర్తింపు
తెలంగాణాలో గాలివాన బీభత్సం – పిడుగుపాటుతో ముగ్గురి మృతి